చమురు సంస్థలు రవాణా ఛార్జీలో భారీగా కోత పెట్టడంపై నిరసన
రోడ్లపై నిలిచిపోయిన 500 ట్యాంకర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : చమురు సంస్థలు రవాణా ఛార్జీలో భారీగా కోత పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ యజమానులు సమ్మె చేపట్టారు.
దీంతో సూర్యాపేట వద్ద తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ సమ్మె బాట పట్టారు. ఆయిల్ సంస్థలు రవాణా ఛార్జీలో 80 శాతం కోత పెట్టడంతో రవాణా కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా ఈ సమ్మెను చేపట్టారు. ఫలితంగా సూర్యాపేటలో పెద్ద సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్స్ రోడ్డు వెంబడి నిలిచిపోయాయి. దాదాపు 500 ఆయిల్ ట్యాంకర్లు రోడ్ల మీద ఆగిపోయాయి. సింగరేణి సంస్థకు కూడా ఆయిల్ ట్యాంకర్స్ సరఫరా ఆగిపోయింది. ఆయిల్ సంస్థలు దిగిరాకపోతే రాష్ట్రం మొత్తం ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేస్తామని తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ యజమానులు హెచ్చరించారు. లాక్డౌన్ సమయంలో ఆయిల్ ట్యాంకర్లు సమ్మె చేస్తే గ్యాస్, పెట్రోల్, డీజీల్ లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను సోమవారం నుంచి ప్రారంభించిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఇలాంటి సమయంలో చమురు సంస్థలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.