ముంబయి: పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఓ వృద్ధురాలు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని బాత్రూమ్లో పడేసిన సంఘటన మహారాష్ట్రలోని అంధేరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గులాబీ శెట్టి (70) అనే వృద్ధురాలు వోలియా కాలేజీ సమీపంలో నివసిస్తోంది. ఆమె ఒక చిన్న బెడ్ రూమ్లో ఉంటూ మిగితా రూమ్లు అద్దెకు ఇస్తుంది. నెలకు రెండు లక్షల రూపాయలు అద్దె తీసుకొని జీవనం సాగిస్తోంది. 1975లో గులాబీ శెట్టి భర్తను హత్య చేయడంతో ఆమె ఒంటరిగా ఉంటుంది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి అనంతరం ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని వాష్రూమ్లో పడేసి వెళ్లిపోయారు. ఆమె మేనకోడలు సుజాత శెట్టి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేశారు. ఆమె స్పందించకపోవడంతో రాత్రి పదిగంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లారు. రాత్రి సమయంలో మెయిన్ డోర్ సగం తెరిచి ఉండడంతో అనుమానం కలిగి ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో అనుమానం కలిగింది. ఇల్లు మొత్తం వెతకగా వాష్రూమ్ లో ఆమె మృతదేహం కనిపించింది. వెంటనే ఆమె స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి వివాదం విషయంలో వృద్ధురాలును అగంతకులు చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.