లక్నో: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై ప్రతిపక్షం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. చట్టానికి వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరిగినా దాన్ని రద్దు చేసే ప్రశ్నే లేదని ఆయన ఖండితంగా చెప్పారు. సిఎఎకు మద్దతుగా ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ షా ఆకాశాన్ని తాకేలా ఉండే అయోధ్య రామమందిర నిర్మాణం మూడు నెల ల్లోగా ప్రారంభమవుతుందని తెలిపారు.
ఎవరి పౌరసత్వాన్నీ హరించే అంశమేదీ సవరించిన చట్టంలో లేదని చెబుతూ ‘కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ , బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు సిఎఎ కు వ్యతిరేకంగా మోసపూరిత ప్రచారం చేస్తున్నాయి’ అని విమర్శించారు. పౌరసత్వం ఇచ్చేందుకే సిఎఎ అని ఆయన చెప్పారు. ‘నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎన్ని ఆందోళనలు చేసినా సిఎఎను ఉపసంహరించే ప్రశ్నే లేదు’ అని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. బహిరంగంగా తనతో సిఎఎపై చర్చించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీలకు అమిత్ షా సవాల్ విసిరారు.