Sunday, April 28, 2024

పాలమూరు ఇక కోనసీమ

- Advertisement -
- Advertisement -

పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతలతో మారిపోనున్న రూపురేఖలు

(బి. రామాంజనేయులు)
మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో: ఒకప్పుడు పాలమూరు అంటే వలసలు, కరువుకు నిలయం.. ఎక్కడ చూసినా బీడువారి నెర్రలు బారిన భూములే. ఛిద్రమైన బ తుకులు, పనులు లేక పొట్ట చేతబట్టుకొని ఇతర రాష్ట్రాల కు లక్షల మంది వలసలు పోయే పరిస్థితి. చెంతనే కృష్ణానది వందల కిలోమీటర్లు పారుతున్నా సాగునీటికి, తాగునీటికి తిప్పలే. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో పా లమూరు కష్టాలను కళ్లారా చూసిన కెసిఆర్ ఆనాడే ప్రజలకు మాటిచ్చారు. కృష్ణమ్మ నీటితో పాలమూరు కళ్లనీళ్లు తుడుస్తానని… అనుకున్న విధంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా నిలిచేలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2016లో కెసిఆర్ శ్రీకారం చుట్టి బగీరథ ప్రయత్నానికి సిద్ధపడ్డారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా 60 రోజుల్లో 90టిఎంసిలను ఎత్తిపోసుకునేలా ఈప్రాజెక్టును రూ పొందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంజనగిరి, వీ రాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ (కర్వేన), ఉదండాపూర్ రిజర్యాయర్లలో దాదాపు 65 టిఎంసిలను సామర్థ్ధంతో నీటిని నిల్వ చేస్తారు. ఈ నీళ్లతో మహబూబ్‌నగర్ జిల్లాలో 22 మండలాల్లోని 402 గ్రామాల పరిధిలో ని 3, 96,273 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లాలో 8మండలా ల్లో 61 గ్రామాల పరిధిలోని 1,03,389 ఎకరాలు మాగాణిగా మారనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలో మొత్తం ఈ ప్రాజెక్టు కింద 12.30 లక్షల ఎకరాలు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందనుంది. అందులో భాగంగా అప్రోచ్ చానల్స్, కెనాల్స్, సొరంగాలు, ఐదు పంప్ హౌస్‌లు, ఐదు రిజర్వాయర్లు నిర్మించారు. ఇప్పటికే దాదాపు 90% పనులు పూర్తి అయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు దాదాపు రూ. 54 వేల కోట్ల అంచనాతో ప్రభుత్వం ఖర్చులు పెట్టింది.
అడుగడుగునా కేసులే
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎతిపోతల పథకానికి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోపాటు, సొంత రాష్టంలోని కొందరు అభివృద్ధి నిరోధకులు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా అడుగడుగునా అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేశారు. ఎక్కడ తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందోనని భయపడి బిజెపి, కాంగ్రెస్ నాయకులు కొందరు కేసులు వేసి పనులు జరగకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్ధానం మేరకు ముందకే సాగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టు పనులు చేపడుతూ వెళ్లింది. పట్టువదలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టు పనులు ఎట్టి పరిస్దితుల్లో ఆపకుండా పరుగులు పెట్టించారు. కేంద్రం నుంచి అనుమతులు రాకుండా కూడా ఆయా పార్టీలు అడ్డుకున్నాయి. న్యాయాన్ని నమ్ముకున్న కెసిఆర్ చివరికి విజయం సాధించారు. కేంద్రం మెడలు వంచి పాలమూరు రంగారెడ్డికి అన్ని క్లియరెన్స్‌లు సాధించారు. దీంతో పిఆర్‌ఎల్‌ఐ పనులు వేగం పెరిగి ప్రారంభానికి సిద్ధమవుతోంది.
కేంద్రంలోని బిజెపి నయా పైస ఇవ్వలే
వలస జిల్లా పాలమూరు గురించి గొప్పలు చెప్పుకునే బిజెపి నాయకులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రాజెక్టుగా తీసుకురాలేక పోయారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా అడ్డుకోవడమే కాకుండా కేంద్రం నుంచి ఒక్క రూపాయి విడుదల చేయించలేకపోయారు. ఒక వైపు కర్నాటకలోని బద్రా ప్రాజెక్టుకు, ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ రా్రష్ట్ర ప్రభుత్వం నుంచే ప్రతి ఏటా నిధులు కేటాయిస్తూ ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారు. మొత్తం రూ. 54వేల కోట్ల అంచనాతో మంజూరైన ఈ ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తి చేసుకుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కోనసీమగా మారనుంది. ఇప్పటికే జిల్లాల్లో జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిలసాగర్, వంటి ప్రాజెక్టులతో జిల్లాలో వేలాది ఎకరాలల్లో కొత్త ఆయకట్టు పెరిగింది. ధాన్యరాసులతో నిత్యం పచ్చదనంతో విరాజిల్లుతోంది. ధాన్యం పండించడంలో టాప్‌గా నిలిచింది. కరువు జిల్లాలో కనకపూలు కురుస్తున్నాయి. నాడు వలసల జిల్లాగా ఉండగా నేడు ఇక్కడికే ఇతర రాస్ట్రాల ప్రజలు పనులు కోసం వస్తున్నారు. ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారులు రావడం, పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా జిల్లాకు తరలి వచ్చాయి. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభమైతే ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా కోనసీమగా మారనుంది.
ఈనెల 16 సిఎం చేతుల మీదగా ప్రారంభం
ఇప్పటికే అధికారులు విజయవంతంగా డ్రైరన్ చేపట్టారు. ఈ నెల 16 రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా నార్లపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే రోజు అక్కడనే పెద్ద బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నారు. రైతులను,్ర పజలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటనను విజయంతం చేసేందుకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు నిరంజన్‌రెడ్డి ఎమ్మెల్యేలు అందరూ కృషి చేస్తున్నారు. అదే రోజు పాలమూరు జిల్లా వ్యాప్తంగా పండుగ జరుపుకోవాలని బిఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News