ముగ్గురు గల్లంతు, ప్రాణాలతో బయటపడ్డ 10 మంది
క్రేన్ సహాయంతో జీపు వెలికితీత
అందులోనే డ్రైవర్ మృతదేహం
గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
వరంగల్ రూరల్ జిల్లా గవిచర్ల సమీపంలో దుర్ఘటన
డ్రైవర్కు ఫిట్స్ రావడం వల్లే ప్రమాదం!
మన తెలంగాణ/వరంగల్ క్రైం/ సంగెం : వరంగల్ నెక్కొండ ప్రధాన రహదారిలోని సంగెం మం డలం గవిచర్ల గ్రామ శివారులో 14 మందితో వెళ్తున్న జీపు నేరుగా రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈసంఘటనలో పదిమంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా ముగ్గురు గల్లంతయ్యారు. బావిలో పడ్డ జీపును క్రేన్ల సహాయంతో బయటికి తీశారు. జీపులోనే ఉన్న మృతదేహాన్ని, డ్రైవర్ సతీష్గా గుర్తించారు. డ్రైవర్కు ఫిట్స్ రావడం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు ప్రాణాలతో బయటపడిన బాధితులు పేర్కొంటున్నారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ నుండి నెక్కొండకు షటిల్ ట్రిప్పులు నడిపే ప్రైవేటు జీపు రోజు వారి కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కూడా వరంగల్లో ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైంది. వరంగల్ శివనగర్లో దాదాపు 3.30 గంటల సమయంలో జీపు నిండుగా ప్రయాణికులతో వరంగల్ నుండి బయలు దేరింది. ప్రతి స్టేజీ వద్ద జీపును ఆపుతూ డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకొని దించుతూ వస్తున్నారు. ఆశాలపల్లి స్టేజీ దాటే సరికి జీపులో 14 మంది ప్రయాణికులున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. వారి తో గవిచర్లకు చేరుకునే సమయంలోనే గ్రామ పొలిమేర రాగానే డ్రైవర్కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. వేగంగా వస్తున్న జీపు అదుపుతప్పి ఎడమవైపుకు దూసుకెళ్లింది. అక్కడే రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయ బావి ఏర్పడకుండా భూమి మట్టంతో నీరు నిలిచి ఉంది. అంతలోపే జీపు దూసుకెళ్లింది. కనురెప్పపాటులోనే జీపు బావిలోకి దూ సుకెళ్లడం అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తేరుకొని ఒక్కొక్కరుగా పదిమంది వరకు బయటపడ్డారు. డ్రైవర్ సహా మరో నలుగురు జీపుతో బావిలోనే గల్లంతైనారు. విషయం తెలిసిన వెంటనే సంగెం, మామునూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే జెసిబి, ఫైరింజన్లను రంగంలోకి దింపారు. వాటితో పాటు గజ ఈతగాళ్లను కూడా పిలిపించి గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే జీపుతో పాటు బావిలో గల్లంతైన వారు డ్రైవర్తో సహా మరో నలుగురు ఉంటారా.. ఇంకా ఎక్కువమంది ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. మంగళవారం రాత్రి గడిచినా కొద్ది సహాయక చర్యలు ముమ్మరమవుతున్నాయి.
ప్రాణాలతో బయటపడ్డ పదిమంది వీరే..
వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులోని వ్యవసాయబావిలో జీపు పడిపోయిన సంఘటనలో పది మంది ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. వారిలో సంగెం, నెక్కొండ మండలాలకు చెందిన వారున్నారు. నెక్కొండ గ్రామానికి చెందిన బండి కట్టయ్య(52), బానోతు విజయ మడిపల్లి, బానోతు రాంచంద్రు మడిపల్లి, గుగులోతు బుజ్జి మదనాపురం, భూక్య చిట్లి గూడూరు మండలం మదనాపురం, గుగులోతు వాజ్య గూడూరు మండలం మదనాపురం, గుగులోతు మంజుల నెక్కొండ, భూక్య శ్రీనివాస్ నెక్కొండ, భూక్య నవీన్ రెడ్లవాడ, మానోతు సుజాత పర్వతగిరిలు సురక్షితంగా ఒకరిసహాయంతో ఒకరు బయటపడ్డారు. గల్లంతైన నలుగురు కూడా ఈ గ్రామాలకు చెందిన వారుగానే భావిస్తున్నారు.
Passenger Jeep fell into Well in Warangal