Monday, April 29, 2024

భవిష్యత్తు తరాల కోసం హరితహారం అంకురార్పణ

- Advertisement -
- Advertisement -
2015లో ప్రభుత్వం ప్రణాళికతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం
రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం
రూ. 700 కోట్లతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు
ఈ ఏడాదిలో 19.29 కోట్ల మొక్కలు నాటేందుకు ప్లాన్
ప్రతి గ్రామంలో ఒక నర్సరీతోపాటు, 19,472 పల్లె ప్రకృతి వనాలు
2,275 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు

హైదరాబాద్: అభివృద్ది, సంక్షేమమే కాకుండా భవిష్యత్తు తరాలకు ఏదైనా చేద్దాం అనే ఆలోచన మదిలో మెదిలిన వెంటనే, సిఎం కెసిఆర్ తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. భవిష్యత్తు తరాలకు భూగోళాన్ని పరిరక్షించడం, పర్యావరణ పరంగా సుస్థిర అభివృద్దిని చేయడమే ఒక మార్గం. వాతావరణ సమతుల్యం ఉండాలంటే 33 శాతం పచ్చదనం తప్పనిసరి. పెరుగుతున్న జనాభాతో అవసరాలు పెరిగి అడవులు కనుమరుగైతున్నాయి. దానితో వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గి ఓజోన్ పొర క్షీణించిపోతుంది. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని వాటి ప్రభావాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికతో ప్రతిష్టాత్మక తెలంగాణకు హరిత హారం కార్యక్రమానికి 2015 లో శ్రీకారం చుట్టింది.

తెలంగాణలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుండి 33 శాతంకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం 2015– 16 లో తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని అంకురార్పణ చేసింది. కేవలం ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రజలను, రైతులను భాగస్వాములను చేసి ఒక ప్రజా ఉద్యమంగా మలచి ముందుకు నడుపుతుంది. హరితహారంలో రాష్ట్రంలో మొత్తం 230 కోట్లు మొక్కలు నాటలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. చైనా, బ్రెజిల్ తర్వాత పచ్చదనాన్ని పెంచడంలో అతిపెద్ద మానవ ప్రయత్నంగా ఖ్యాతికెక్కింది. ఈ కార్యక్రమం చేపట్టడంలో పర్యావరణ సమతుల్యం కాపాడుకోవడంతో పాటు జీవనోపాధి కల్పన, మంచి వర్షపాతం నమోదు అవుతుంది. ప్రతి గ్రామంలో చెట్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి, మొక్కలను నాటి వాటిని రక్షించి, గ్రామంలో పచ్చదనాన్ని పెంచి, పరిశుభ్రతను కాపాడాలని ఆ చట్టంలో పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన కార్యక్రమాన్ని పర్యవేక్షించేదుకు హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. జియో ట్యాగింగ్ ద్వారా మొక్కలను పర్యవేక్షించడం జరుగుతుంది. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, సంస్థగత ప్లాంటేషన్, హోమ్ స్టెడ్ ప్లాంటేషన్,ఆగ్రో ఫారెస్ట్రి ప్లాంటేషన్ పేరిట మొక్కలు పెద్ద సంఖ్యలో నాటే కార్యక్రమం చేపట్టింది.

సవరించిన పంచాయతీ రాజ్ చట్టం 2018, మున్సిపల్ చట్టం 2019 లో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం బడ్జెట్ లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌గా కేటాయించి, పచ్చదనాన్ని విస్తరించేదుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. 2015–16 లో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పెరిగిందని పేర్కొన్నారు.

గతంలో పట్టణాలు, నగరాల్లో పచ్చదనం కరువై, ఉద్యానవనాలు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక నర్సరీతోపాటు, 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,275 భృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. రహదారులకు ఇరువైపులా మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచడం జరుగుతుంది. పట్టణాలో రూ. 700 కోట్ల వ్యయంతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్‌లను ఏర్పాటు చేసింది. వినూత్నంగా వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు చేసింది. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులను హరితనిధిలో భాగస్వాములు చేసింది. వీరందరి నుంచి సేకరించిన మొత్తంలో హరితనిధి ఏర్పాటు అయ్యింది. హరితనిధికి నోడల్ ఏజన్సీ గా అటవీ శాఖ వ్యవహరిస్తుంది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల సహకారం తొడవడంతో తెలంగాణకు హరిత హారం కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. సుమారు ఒక లక్ష కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా రహదారి వనాలను (అవెన్యూ ప్లాంటేషన్ ) ఏర్పాటు చేయడం జరిగింది. 13.44 లక్షల ఎకరాల క్షీణించిన అడవులను పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 19.29 కోట్ల మొక్కలను నాటలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ ఏడాది అన్నీ సాగునీటి ప్రాజెక్టుల స్థలాల, కాలువల వెంట పచ్చదనం పెంచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Green 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News