రాహుల్ గాంధీ ఆరోపణ
హిసువా(బీహార్): లడఖ్లోని భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని వ్యాఖ్యానించడం ద్వారా భారత సైనికులను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా సైనికులను ఎప్పుడూ దేశం నుంచి వెళ్లగొడతారో దేశ ప్రజలకు ప్రధాని మోడీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన తొలి ప్రచార సభలో రాహుల్ గాంధీ శుక్రవారం ప్రసంగిస్తూ భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడిందన్నది వాస్తవమని చెప్పారు. 1,200 కిలోమీటర్ల మన భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందని, అయితే ఎవరూ చొరబడలేదని ప్రకటించి ప్రధాని మోడీ మన సైనికులను ఎందుకు అవమానించారని రాహుల్ ప్రశ్నించారు. మన సరిహద్దుల్లో తిష్టవేసుకుని కూర్చున్న చైనా సైనికులను ఎప్పుడు వెళ్లగొడతారో ప్రధాని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తలెత్తిన వలస కార్మికుల సంక్షోభంపై ఆయన కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి బీహారీ కార్మికులను తరిమి కొడితే ప్రధాని నుంచి వారికి ఎటువంటి సాయం అందలేదని ఆయన విమర్శించారు. కార్మికుల ఎదుట మోకరిల్లే ప్రధాని వారికి కష్టకాలం వచ్చినపుడు మాత్రం సాయపడరని ఆయన వ్యాఖ్యానించారు. బీహారీలకు ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారో ప్రధాని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నావడా జిల్లాలోని హిసువా అసెంబ్లీ నియోజవర్గంలో కాంగ్రెస్ తరఫున నీతూ సింగ్ సిట్టింగ్ బిజెపి అభ్యర్థి అనిల్ సింగ్పై పోటీచేస్తున్నారు. హిసువా ర్యాలీకి ప్రజలు భారీఎత్తున హాజరయ్యారు. మహాగట్బంధన్కు చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ ఈ ఎన్నికలు కుల మతాలకు చెందిన అంశాలపై కాక నిరుద్యోగం, పేదరికం ప్రధానాంశాలుగా జరుగుతున్నాయని చెప్పారు.