Monday, April 29, 2024

వారణాసి చేరుకున్న ప్రధాని మోడీ!

- Advertisement -
- Advertisement -

వారణాసి: ‘కాశీయిల్ తమిళ్ సంగమం’ ప్రారంభోత్సవానికిగాను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వారణాసి చేరుకున్నారు. నెల రోజులపాటు జరిగే కాశీయిల్ తమిళ్ సంగమం కార్యక్రమంతోపాటు ‘తిరుక్కురళ్ ’, ‘కాశీ-తమిళ సంస్కృతి’ పుస్తకాలను కూడా ఆవిష్కరించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం నెల రోజులపాటు ‘తమిళ సంగమం’ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో తమిళ సాహిత్యం, విద్య, సంస్కృతి, వంటకాలు వగైరా ఉంటాయి. తమిళనాడు నుంచి వచ్చే అతిథులు కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను సందర్శించుకుంటారు.
కాశీ తమిళ్ సంగమంలో మొత్తం 75 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి డిసెంబర్ 16 వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమం ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశం మధ్య ఓ అనుసంధానంలా ఉండగలదంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సంస్కృతి, సాహిత్యం, సంగీతం, భోజనం, చేనేత, హస్తకళలు,జానపద కళ వంటి వాటి మూలంగా ఉత్తర, దక్షిణ భారత దేశ సమ్మేళనం కానున్నాయని భావిస్తున్నారు.
తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది మతాధికారులను కూడా ప్రధాని మోడీ సన్మానించనున్నారు. వారిలో శ్రీమద్ మణిక్కవచక్ తంబిరన్, స్వామి శీవకర్ దేశీకర్, శ్రీలశ్రీ సత్య జ్ఞాన మహదేవ్ దేశీక్ పరమాచార్య స్వామిగళ్, శివ ప్రకాశ్ దేశిక్ సత్య జ్ఞాన పందర్ సన్నధి, శ్రీ శివజ్ఞాన బాలయ స్వామిగళ్, జ్ఞానప్రకాశ్ దేశికర్, శివలింగేశ్వర్ స్వామి కందస్వామి, మయకృష్ణన్ స్వామి, ముతు శివరామస్వామి ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబేన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరుకానున్నారు. కాశీకి, తమిళనాడుకు మధ్య అనాదిగా సంబంధాలున్నాయి. ప్రాచీన కాలంలో చాలా మంది తమిళనాడు నుంచి కాశీకి వెళ్లి విద్యనభ్యసించేవారు. సెమినార్లు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి 2500 మందికి పైగా ప్రతినిధులు హాజరుకాబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News