Monday, April 29, 2024

ఇండ్లలోనే ఉండి దిపాలు వెలిగించండి

- Advertisement -
- Advertisement -

ఇండ్లలోనే ఉండండి దివ్వెలు వెలిగించండి
జనవరి 22న అయోధ్యకు రాకండి
దేశ వికాసానికి రామాలయమే స్ఫూర్తి
రోడ్‌షో, ఎయిర్‌పోర్టు.. రైల్వేస్టేషన్ల ఆరంభం
అనంతర బహిరంగ సభలో మోడీ
అయోధ్య: వచ్చే నెల 22న ప్రజలు అయోధ్యకు దయచేసి రాకండి అని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఆరోజు ప్రాణ ప్రతిష్టాత్మక రీతిలో శ్రీరామాలయ ఆరంభం జరుగుతుంది. ఈ దశలో ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రధాని శనివారం అయోధ్యలో భావోద్వేగపూరిత ప్రకటన వెలువరించారు. ప్రజలు రాముని పట్ల భక్తి ఆదరణ భావంతో ఇండ్లలోనే దీపాలు వెలిగించవచ్చు, అసంఖ్యాక కోటానుకోట్ల శ్రీ రామజ్యోతులు దేశమంతా విస్తరించుకుపోవచ్చు. దీపాలు వెలిగించండి, మీ మీ ప్రాంతాల నుంచే మది నిండిన ఆనందోత్సహాలను వెల్లివిరిసేలా చేయండి. రామభక్తులుగా మనమంతా శ్రీరాముడికి ఎటువంటి అసౌకర్యం కల్గించవద్దు.

దూర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి ఈ ప్రతిష్టాపన ఘట్టాన్నితిలకించాలనే తపనతో ఉండటం సహజమే. అయితే జనవరి 23వ తేదీ ఘట్టానికి తరలిరావల్సిన అవసరం లేదు. దీని వల్ల తలెత్తే సమస్యలను అర్థం చేసుకోండి. జనవరి 23 నుంచి ఇక శాశ్వతంగా అజరామరంగా ఎప్పుడైనా అయోధ్యకు ఎవరైనా తరలిరావచ్చు. రామమందిరం ఇక్కడ సర్వదా ఉంటుంది. భక్తుల సందర్శనకు సిద్ధంగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకోవాలని మోడీ కోరారు. ప్రపంచమంతా జనవరి 22 వ తేదీన జరిగే చారిత్రక రామ ప్రతిష్టకోసం నిరీక్షిస్తోంది. ఈ విషయం మీకు తెలుసు నాకు తెలుసు. దేశ ప్రగతి (వికాస్), వారసత్వం (విరాసత్) కలియగలిసి దేశం ముందుకు సాగుతుందని, రామాలయ ఆరంభ దశ మరింత స్ఫూర్తిదాయకం అవుతుందన్నారు.

దియా జలావో, ప్రతి ఇంటా దివాలీ మనావో అని ప్రధాని పిలుపు నిచ్చారు. పాపం రామ్‌లల్లా ఇక్కడ మొన్నమొన్నటివరకూ గుడారంలో నివసించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఫక్కా నివాసం ఏర్పర్చుకున్నట్లు అయిందని తెలిపారు. ఇదే దశలో దేశంలోని నాలుగుకోట్ల మంది పేదలకు కూడా నివాసయోగ్య గృహాలు పొందారని ప్రధాని తెలిపారు. జనవరిలో రామాలయ ప్రారంభం నేపథ్యంలో అయోధ్యలో పునర్నిర్మిత ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌ల ప్రారంభం తరువాత ఏర్పాటు అయిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇప్పటికే అయోధ్య రామాలయం చూడటానికి జనం ఇక్కడికి తరలిరావడానికి సిద్ధం అయ్యారు. ప్రత్యేకించి ప్రతిష్టరోజున లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ ప్రజలకు తరలిరాకండి, స్మరించుకోండని పిలుపు నిచ్చారు.

దేశ ప్రజలందరికీ ఇప్పుడు తాను చేతులెత్తి ప్రార్థించేది ఒక్కటే జనవరి 22న ఇక్కడికి రావద్దనేదే అని తెలిపారు. పూర్తి స్థాయి అధునాతన హంగులతో నిర్మించిన ఇక్కడి రైల్వే స్టేషన్ అయోధ్య జంక్షన్ పేరును ఇప్పుడు అయోధ్య ఛార్‌దామ్ జంక్షన్ అని, ఇక్కడి ఎయిర్‌పోర్టు పేరును మహర్షి వాల్మీకి విమానాశ్రయం అని కొత్త పేర్లకు మార్చారు. అయోధ్యలో అంతకు ముందు జరిగిన రోడ్‌షోలో కూడా ప్రధాని ఉత్సాహంగా పాల్గొన్నారు. అయోధ్య ప్రజలకు తన ప్రత్యేక ధన్యవాదాలని, తమ ప్రాంతపు విశ్వవ్యాప్త రాముడు మరింత వైభవంగా కొలువుదీరిన ఘట్టానికి ఇక్కడి వారు ఆతిధ్యం ఇవ్వడం వారికి ఎనలేని ఆనందం కల్గిస్తుందని తెలిపారు. ఈ దశలో ఇక్కడి సరయూ నది సాక్షిగా మనమంతా ప్రతిన వహించాల్సిన విషయాలు అనేకం ఉన్నాయని వివరించారు. అయోధ్యను స్వచ్ఛం శుభ్రతల నగరంగా మల్చుకుందాం, అయోధ్య మునుపటి ప్రతిష్ట మరింత ఇనుమడిస్తోంది.

ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సరికొత్త దారులు ఏర్పడుతున్నాయి. పర్యాటకులు, యాత్రికులు, భక్తులు ఇక్కడికి వచ్చి విశేషానుభూతులను సంతరించుకుని వెళ్లేలా చేసే దిశలో అయోధ్యపౌరులు అంతా ప్రతి ఒక్కరుగా సహకరించాలి. ఈ బాధ్యతను అంతా తీసుకోవాలి. జనవరి 14 నుంచి 22 వరకూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు,దేవస్థాన సముదాయాల పరిశుభ్రతను ఓ ఉద్యమంగా చేపట్టాల్సి ఉందని కోరారు. అయోధ్యలో జరిగిన బహిరంగ సభలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ వికె సింగ్, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. స్థానిక వినూత్న మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ ప్రాంగణంలో జరిగిన జనసభలో ప్రధాని మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News