Monday, April 29, 2024

యూట్యూబ్ ఇండియాపై మహారాష్ట్ర పోలీస్‌ల కేసు

- Advertisement -
- Advertisement -

ముంబై : తల్లీ కుమారులపై అభ్యంతరకర వీడియోలు యూ ట్యూబ్ కొన్ని ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబ్ ఇండియాపై మహారాష్ట్ర పోలీస్‌లు గురువారం కేసు నమోదు చేశారు. ఈ విధమైన అసభ్యకర వీడియోలను పోస్ట్ చేస్తుండటంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీస్‌లు చర్యలు చేపట్టారు. యూట్యూబ్ ఛానల్ ఆపరేటర్‌పై కూడా పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈమేరకు యూట్యూబ్ ఇండియా కు సమన్లు జారీ అయ్యాయి. ఆయా ఛానళ్ల జాబితాతో ఆ సంస్థ ప్రతినిధి జనవరి 15న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎన్‌సిపిఆర్ ఆదేశించింది.

ఈమేరకు భారత్ లోని యూట్యూబ్ పబ్లిక్ పాలసీ హెడ్ మీరా ఛాట్‌కు కమిషన్ లేఖ రాసింది. ఎన్‌సిపిసిఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో దీనిపై మాట్లాడుతూ తల్లులు, యుక్తవయసు కుమారుల మధ్య అసభ్యకర సన్నివేశాలతో కొన్ని ఛానళ్లు వీడియోలను విడుదల చేస్తున్నాయని, ఇవి పోక్సో చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలతో వ్యాపారం చేయడం , అశ్లీల దృశ్యాలను అమ్మడం లాంటిదే అని వ్యాఖ్యానించారు. దీనిపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని, ఈ దారుణాలకు బాధ్యులైన వారిని జైలుకు పంపాలని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News