Monday, April 29, 2024

కొన్ని చోట్ల మొరాయించిన ఓటింగ్ యంత్రాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాల మొరాయింపుతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ ఆలస్యంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 33వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఈవిఎం పని చేయలేదు.చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని 63వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవిఎం మొరాయించడంతో సుమారు అరగంట పాటు ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్ 153లో ఓటింగ్ యంత్రాలు పని చేయలేదు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలోని 199వ బూత్‌లో ఈవిఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో ఈవిఎం మొరాయించింది. దీంతో ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్లోనే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రంలోని ఓటింగ్ యంత్రం పనిచేయలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామంలో ఇంకా పోలింగ్ చాలా సేపటి వరకు మెుదలు కాలేదు. మూరుమూల అటవీ ప్రాంతంలో ఉండే ఈ గ్రామంలో ఓటర్లు నిరసనకు దిగారు. తమకు ఏళ్లుగా రోడ్డు సమస్య వేధిస్తున్నా ఏ నాయకుడు తమ గోడును పట్టించుకోలేదని ఆందోళనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News