కరోనా రోగులకు పడకలపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టతనివ్వని ప్రైవేటు యాజమాన్యాలు
సిఎం తుది నిర్ణయం తీసుకుంటారని వైద్యాధికారుల వెల్లడి
సోమవారమే జరగాల్సిన చర్చలు రద్దు
మన తెలంగాణ/హైదరాబాద్:ప్రభుత్వంతో కలిసి కరోనా వైద్యం అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ ముందుకు వచ్చే అవకాశాలు లేనట్లు కనిపిస్తుంది. వైద్యశాఖ ప్రతిపాదనలపై ఇప్పటి వరకు ప్రైవేట్ యాజమాన్యాలు స్పందించలేదు. ఇదే విషయాన్ని ఆరోగ్యశాఖ సిఎం దృష్టికి తీసుకువెళ్లింది. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల విధివిధానాలపై ఇక నుంచి సిఎం నిర్ణయాలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కోవిడ్ సేవల కొరకు ప్రతి హాస్పిటల్లో 50 శాతం బెడ్లు ఇచ్చేందుకు ఈనెల 13వ తేదిన స్వయంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముందు ఒప్పుకున్న 50% ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ తర్వాత వెనకడుగు వేశాయి. విధివిధానాలపై వైద్యశాఖతో భేటీ అవ్వాలని మంత్రి సూచన మేరకు ఈనెల 14వ తేదిన హెల్త్ ఆఫీసర్లకు, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలకు ఓసారి చర్చలు జరిగినా అవి అర్ధంతరంగా ముగిశాయి. అయితే ఆ చర్చలో వైద్యశాఖ కొన్ని ప్రతిపాదనలు సూచించింది. కానీ కొన్ని ఆసుపత్రులు వాటికి సుముఖంగా ఉన్నప్పటికీ, మరికొన్ని ఆసక్తిగా లేనట్లు ఓ అధికారి చెప్పారు. దీంతోనే ప్రైవేట్ యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. సోమవారం జరగాల్సిన చర్చలు రద్దు అవడానికి కూడా కారణం ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు.
వైద్యశాఖ ప్రతిపాదనలు…
ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 50 శాతం బెడ్లకు ఖచ్చితంగా ప్రతి రోజూ సాధారణ వార్డుకు 4వేలు, ఐసియూకు రూ.7500, వెంటిలేటర్పై ఉంచితే 9వేలు చొప్పున తీసుకోవాలి. ఈ విధానంలో సిద్ధం లేకుంటే మరో ఫ్యాకేజీని కూడా వైద్యశాఖ ప్రతిపాదించింది. దాని ప్రకారం 14 రోజులు సాధారణ వార్డులో చికిత్స పొందితే రూ.లక్ష, ఆక్సిజన్ వార్డుకు రూ.2 లక్షలు, ఐసియూ వార్డులో ఉంచితే రూ.3 లక్షలు తీసుకోవాలి. ఈ విధానంలో దీర్ఘకాలిక రోగులకు ఎన్ని సార్లు స్కానింగ్లు ఇతర ఖరీదైన మందులు వాడినా గరిష్ఠంగా రూ4 లక్షలకు మించకుండా తీసుకోవాలని సూచించింది.
ఈ బెడ్లను ఓ యాప్ ద్వారా తామే నింపుతామని వైద్యశాఖ పేర్కొంది. అయితే మిగతా 50 శాతం బెడ్లలో తమకు సంబంధం లేదని హెల్త్ అధికారులు తెలిపారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు సమలోచనలో పడ్డాయి. తమ ఆసుపత్రుల్లో ప్రభుత్వం పెత్తనం ఉంటే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందేమోనని కొన్ని ఆసుపత్రులు మొహం చాటేశాయి.
Private Hospitals Owners not response on 50% Beds