పంజాబ్ అంశంపై కాంగ్రెస్
న్యూఢిల్లీ : పంజాబ్ పిసిసి అధ్యక్షులు నవ్జోత్ సింగ్ సిద్ధూ రాజీనామా ఇతర అంశాలపై బుధవారం కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పందించాయి. అక్కడి పరిణామాలను పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అక్కడి అంశాలు అన్నింటినీ రావత్ స్థానికంగా ఉంటూ గమనిస్తున్నారని, అక్కడి విషయాలపై ఆయనే సరిగ్గా చెప్పగలరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినాతే తెలిపారు. అక్కడేం జరుగుతుందనేది ఆయనకే ఎక్కువగా తెలుసునని తాను పెద్దగా స్పందించే వీలులేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై జవాబిచ్చేందుకు రావత్ వార్తాసంస్థలకు అందుబాటులోకి రాలేదు. పంజాబ్ పరిణామాలపై టీవీలో చర్చాగోష్టి సందర్భంగా ఓ న్యూస్ యాంకర్ పార్టీ నేత రాహుల్ గాంధీని కించపర్చే విధంగా మాట్లాడటంపై సుప్రియా శ్రినాతే ఘాటుగా స్పందించారు. ఇటువంటివి గర్హనీయం అన్నారు. రానురానూ మీడియా బిజెపి చేతిలో కీలుబొమ్మ అవుతోందని విమర్శించారు.