Sunday, April 28, 2024

ఉక్రెయిన్‌ను మూడు ముక్కలు చేసిన పుతిన్

- Advertisement -
- Advertisement -
Putin divides Ukraine into three parts
వేర్పాటువాద ప్రాంతాలను దేశాలుగా గుర్తించిన రష్యా
శాంతి పరిరక్షక దళాల పేరుతో ఆ ప్రాంతాలకు సైన్యం తరలింపు
రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా, బ్రిటన్

మాస్కో: ప్రపంచం భయపడినంతా జరిగింది. తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఉక్రెయిన్‌ను మూడు ముక్కలుగా చేసినట్లయింది. ఇప్పటికే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు దొనెట్స్, లుహాన్స్ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్లు రష్యా ప్రకటించింది.అంతటితో ఆగకుండా ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు శాంతి పరిరక్షక దళాలపేరిట రష్యా సేనలను పంపించాలనిఆదేశించారు. అంతేకాదు ఉక్రెయిన్ ఉనికినే పుతిన్ ప్రశ్నించడం పశ్చిమ దేశాలను కలవరపెడుతోంది. పుతిన్ అధ్యక్షతన సోమవారం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు ప్రత్యేక దేశాలుగా గుర్తింపు ఇవ్వాలని అధ్యక్షుడిని కోరారు. అదే సమయంలో ఉక్రెయిన్ దళాలు అక్కడ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు.

ఈ కౌన్సిల్‌లో మిలిటరీ, ఇంటెలిజన్స్ చీఫ్‌లు,విదేశాంగ మంత్రి లావ్రోవ్, ప్రధాని మిఖైయిల్ మిస్‌హస్టిన్ తదితరులున్నారు.2014లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటు ప్రాంతాల స్వాతంత్య్రాన్ని రష్యా గుర్తించినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పొస్కోవ్ తెలిపారు.ఈ వేర్పాటువాద ప్రాంతాలు స్వాతంత్య్రం ప్రకటించుకున్న తర్వాత దాదాపు 8 ఏళ్ల పాటు సాగిన పోరులో ఉక్రెయిన్‌తిరిగి ఈ ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పోరులో 14,000 మందికి పైగా ప్రజలు మరణించారు.ఈ రెండు ప్రాంతాల స్వాతంత్య్రాన్ని తాము గుర్తిస్తామని రష్యా ప్రకటించిన తర్వాత పుతిన్ ఈ రెండు ప్రాంతాలను ప్రత్యేక దేశాలను గుర్తిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఉక్రెయిన్ పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిందని పుతిన్ సోమవారం జాతీయ టెలివిజన్‌లో ప్రసంగిస్తూ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు అసలు ఎప్పుడూ సొంత దేశ హోదా లేదని, దానికి ఎప్పుడూ స్థిరమైన రాజ్యాధికారం లేదని కూడా ఆయన అన్నారు. ఉక్రెయిన్ సొంతంగా అణ్వాయుధాన్ని తయారు చేయగలదని, దానికి పశ్చిమ దేశాలు సాయం చేసే అవకాశం ఉందని, అదే అసలైన ముప్పని కూడా పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ టెలివిజన్ ప్రసంగం అనంతరం పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్, లుహాన్స్ ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత డిక్లరేషన్‌పై సంతకం కూడా చేశారు. అదే సమయంలో వేర్పాటువాద నాయకులు పుతిన్‌ను సైనిక సాయం కోరారు. దీంతో రష్యా తరఫున శాంతిపరిరక్షక దళాలను పంపించాలని పుతిన్ నిర్ణయించారు. ఉక్రెయిన్ నరమేధానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దీంతో ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి దీన్ని ఒక సాకుగా చూపించే అవకాశముందని పశ్చిమ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కాగా పుతిన్ ప్రకటన తర్వాత సోమవారం పొద్దుపోయాక సాయుధ వాహనాలు వేర్పాటువాదుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించడం మొదలు పెట్టాయి. అయితే ఇవి రష్యా సైనిక వాహనాలా అనే విషయం మాత్రం ధ్రువీకరణ కాలేదు. తాము తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లో తాము బలగాలను మోహరించినట్లు రష్యా ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే రష్యా సైన్యాలు ఇప్పటికే ఈ ప్రాంతాలకు చేరుకున్నాయని డొనెట్స్‌లోని వేర్పాటువాద లోకల్ కౌన్సిల్ సభ్యుడైన వ్లాదిస్లావ్ బ్రిగ్ మీడియాకు చెప్పారు.

ఆంక్షలు విధించిన అమెరికా, బ్రిటన్

రష్యా చర్యలపై మండిపడుతున్న నాటో దేశాలు ఆ దేశంపై పలు ఆంక్షలు విధించాయి.ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించిన దేశాల్లో ఐరోపా సమాఖ్య, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలున్నాయి. ఉక్రెయిన్‌నుంచి వేర్పడిన దొనెట్స్, లుహాన్స్ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారాలు చేయకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.ఆ ప్రాంతాల్లో అమెరికావాసులు ఎలాంటి పెట్టుబడులు పెట్టరు.ఆ ప్రాంతానికి చెందిన సరకులు, ఇతర సేవలను, టెక్నాలజీని ఏ రూపంలోను అమెరికా దిగుమతి చేసుకోకుండా ఈ ఆంక్షలు అడ్డుకోనున్నాయి. కాగా రష్యాపై విధించనున్న ఆంక్షలను మంగళవారం అమెరికా ప్రకటించనుంది. ఈ విషయాన్ని శ్వేత సౌధం(అధ్యక్ష భవనం) వెల్లడించినట్లు ఆంగ్ల వార్తాసంస్థ బిబిసి తెలిపింది. కాగా అయిదు రష్యా బ్యాంకులపైన, ముగ్గురు హై నెట్‌వర్త్(సంపన్న) వ్యక్తులపైన బ్రిటన్ ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటీష్ ప్రధాని బొరిస్ జాన్సన్ మంగళవారం ప్రకటించారు.

‘క్రెమ్లిన్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు, సంస్థలపైన ఆంక్షలు విధించడం కోసం ప్రభుత్వం పార్లమెంటు ఆమోదించిన కొత్త అధికారాలను ఉపయోగించుకుంటుందని జాన్సన్ పార్లమెంటులో చెప్పారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఏం జరగనుందో తాము చెప్పలేమని కూడా ఆయన అన్నారు. రొసియా బ్యాంక్, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రొమ్స్‌వ్యాజ్ బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంక్‌పై ఈ ఆంక్షలు వర్తిస్తాయి.అలాగే బ్రిటన్‌లో వ్యాపారవేత్తలు గెన్నడీ టెమ్‌చెంకో,బొరిస్ రోటెన్‌బెర్గ్,ఇగోర్ రోటెన్‌బెర్గ్‌లకు ఏవైనా ఆస్తులుంటే వాటిని కూడా స్తంభింపజేస్తారు. ఇది మొదటి విడత మాత్రమేనని, అమెరికా, ఐరోపా సమాజంతో పాటుగా తదుపరి ఆంక్షలు విధించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని బొరిస్ జాన్సన్ ప్రకటించారు. కాగా ఆంక్షలపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని ఇయు విదేశీ విధానం చీఫ్ జోసెఫ్ బొరెల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News