Monday, April 29, 2024

పొంగులేటిపై పువ్వాడ సీరియస్..

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ వల్ల పెద్దవాళ్లుగా పేరుతెచ్చుకున్న కొందరు ఇప్పుడు అదే పార్టీకి ద్రోహం చేస్తున్నారంటూ పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ సీరియస్ అయ్యారు. ఇలాంటివారు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వారికి ఉద్యమనాయకుడు కెసిఆర్‌ను విమర్శించే స్థాయి లేదు, ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిదని పొంగులేటిని పువ్వాడ హెచ్చరించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించారన్నారు. కాబట్టే రెండోసారి ప్రజలు ఆయనకే అవకాశం ఇచ్చారన్నారు. ఈసారి కూడా సుపరిపాలన అందించిన కెసిఆరే వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయి హ్యాట్రిక్ సాధించబోతున్నారని మంత్రి పువ్వాడ జోస్యం చెప్పారు. యావత్ తెలంగాణతో పాటే ఖమ్మం జిల్లాలోనూ కెసిఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఖమ్మం జిల్లా బిడ్డగా తన జీవితంలో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ తొమ్మిదేళ్లలో చూశానన్నారు. కాబట్టి పని చేసిన ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపై ఉందన్నారు.

ఖమ్మం జిల్లాలోని మారుమూల గూడెంలు, తండాలకు గతంలో రోడ్డు, విద్యుత్ సౌకర్యం వుండేదికాదు, కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అలాంటి ప్రాంతాలకు అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించి దాహం తీర్చారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజనులకు లక్షన్నర ఎకరాల పట్టాలు ఇచ్చిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని పువ్వాడ కొనియాడారు. ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ అదిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ సైనికులుగా పనిచేసి గెలిపించుకుంటామని, ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రతి ఇంటికి గడపకు వెళతామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే మన ప్రభుత్వంలో మన ఎంఎల్‌ఎలే ఉంటే అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది… ప్రజల ఆకాంక్షలు వేగంగా నెరవేరుతాయని రవాణ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News