Monday, April 29, 2024

నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ పార్టీ..

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi party at Nepal nightclub

వీడియోతో విరుచుకుపడ్డ బిజెపి

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ లోని ఓ నైట్ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయనతోపాటు నేపాల్ లోని చైనా రాయబారి కూడా ఉన్నట్టు వార్తలు రావడంతో బిజేపి విరుచుకుపడింది. కొందరు బిజేపి నేతలు ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. ఈ వీడియోలో ఉన్నది కాఠ్‌మాండూ లోని ఓ పాపులర్ నైట్‌క్లబ్ అని తెలుస్తోంది. తన జర్నలిస్టు ఫ్రెండ్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ సోమవారం నేపాల్ వచ్చినట్టు అక్కడి స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. రాహుల్ తన స్నేహితులతో కలిసి మారియట్ హోటల్‌లో బస చేసినట్టు తెలిపాయి. అయితే ఈ వీడియో గురించి ఆ కథనాలు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ వీడియోలో రాహుల్‌తో కన్పిస్తోన్న మహిళ నేపాల్ లోని చైనా రాయబారి అని తెలుస్తోంది. దీంతో బిజేపి భగ్గుమంది . ఈ వీడియోను బిజేపి నేత కపిల్ మిశ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉన్నది ఎవరూ? అని ప్రశ్నించారు. రాహుల్ వ్యక్తిగత జీవితం గురించి తమకు అవసరం లేదని, అయితే చైనేస్ ఏజెంట్లతో ఉంటే మాత్రం కచ్చితంగా ప్రశ్నించాల్సిందేనని అన్నారు. బిజేపి ఐటీ కన్వీనర్ అమిత్ మాల్వియా పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్ విదేశాల్లో నైట్ క్లబ్‌ల్లో పార్టీ చేసుకుంటున్నారని విమర్శించారు. “ రాజస్థాన్‌లో మత ఘర్షణలు చోటు చేసుకుంటుంటే రాహుల్ మాత్రం పార్టీల్లో ఉన్నారు. ఈయన కనీసం పార్టీ టైం రాజకీయ నాయకుడు కూడా కాదు. పార్టీ టైం పొలిటీషియన్ అని మరో బిజేపి నేత ఎద్దేవా చేశారు.

నవాజ్ షరీఫ్‌తో కేక్ కట్ చేయలేదు కదా : కాంగ్రెస్ వ్యాఖ్య

అయితే ఈ వీడియోపై కాంగ్రెస్ స్పందిస్తూ బిజెపికి కౌంటర్ ఇచ్చింది. ఓ మిత్ర దేశంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లడం నేరమేమీ కాదని పేర్కొంది. ప్రధాని మోడీ మాదిరిగా రాహుల్ గాంధీ ఏం పాకిస్థాన్ లోని పిలవని వేడుకకు వెళ్లి నవాజ్ షరీఫ్‌తో కేక్ కట్ చేయలేదు కదా… జర్నలిస్టు ఫ్రెండ్ వివాహానికి హాజరయ్యేందుకు మిత్ర దేశమైన నేపాల్ వెళ్లారు. ఇందులో తప్పేం లేదు. ఇదేం నేరం కాదు. బహుశా స్నేహితులు, కుటుంబ సభ్యుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని కూడా నేరంగా భావిస్తూ బిజెపి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందేమో అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. 2015 లో ప్రధాని మోడీ అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె వివాహానికి అనూహ్యంగా హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ సుర్జేవాలా విమర్శించారు. ఇదిలా ఉండగా, కొద్ది గంటల క్రితమే ప్రధాని మూడు దేశాల పర్యటనపై కాంగ్రెస్ విమర్శిస్తూ ఓ ట్వీట్ చేసింది. దేశం సంక్షోభంలో ఉంటే , సాహెబ్ విదేశాల్లో ఉన్నారు ” అని కాంగ్రెస్ విమర్శించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News