Monday, April 29, 2024

అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఎత్తేస్తాం:రాహుల్

- Advertisement -
- Advertisement -

రాంచి: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం వాగ్దానం చేశారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా సోమవారం నాడిక్కడ ఒక బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. జార్ఖండ్‌లో గిరిజనుడు ముఖ్యమంత్రిగా ఉండడాన్ని సహించలేకనే జెఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జెడితో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి ప్రయత్నించిందని రాహుల్ ఆరోపించారు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కుట్రను అడ్డుకుని జార్కండ్‌లో పేదల ప్రభుత్వాన్ని కాపాడినందుకు ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ సారథ్యంలోని కూటమికి చెందిన ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాలను(ఓబిసిలు) వెట్టి కార్మికులుగా మార్చివేశారని, బడా కంపెనీలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలలో వారి భాగస్వామ్యం కొరవడిందని రాహుల్ అన్నారు.

భారతదేశం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదేనని, దేశంలో కుల గణనను నిర్వహించడమే మన తొలి అడుగు అవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుత చట్టాల కింద 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేమని ఆయన వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని విసిరి పారేస్తామని ఆయన వాగ్దానం చేశారు. దళితులు, ఆదివాసీల రిజర్వేషన్లలో ఎటువంటి తగ్గింపు ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు. సమాజంలోని వెనుకబడిన తరగతులకు వారి హక్కులు లభిస్తాయని తాను భరోసా ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. సామాజిక, ఆర్థిక అన్యాయమే దేశం ముందున్న అతి పెద్ద సమస్యని రాహుల్ చెప్పారు. తాను ఓబిసినని ప్రధాని నరేంద్ర మోడీ తరచు చెబుతుంటారని, అయితే కుల గణన డిమాండు లేవనెత్తిన ప్రతిసారి ఈ దేశంలో ధనిక, పేద అనే రెండే కులాలు ఉన్నాయని ఆయన ప్రకటిస్తుంటారని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఓబిసిలు, దళితులు, గిరిజనులకు వారి హక్కుల్సిన సమయం ఆసన్నమైనపుడు దేశంలో కులాలే లేవని మోడీ చెబుతుంటారని, కాని ఓట్లు పొందాల్సిన సమయం వచ్చినపుడు మాత్రం తాను ఓబిసినని చెప్పుకుంటారని రాహుల్ ఎదుఏద్దేవా చేశారు. జార్ఖండ్ అసెంబ్లీలో చంపయి సోరెన్ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చినపుడు గిరిజనుడిని ముఖ్యమంత్రిగా సహించలేని బిజెపి కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, జెంఎం, ఆర్‌జెడి ఎమ్మెల్యేలు కలసికట్టుగా నిలబడి ప్రభుత్వాన్ని కాపాడుకున్నారని ఆయన తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ధన బలం ద్వారా ప్రతిపక్ష పాలిత అన్ని రాష్ట్రాలలో ఇదే పనిచేయడానికి బిజెపి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంపైన, రాజ్యాంగంపైన దాడి చేస్తున్న బిజెపి నాయకులు ప్రజల గొంతును నొక్కివేయడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే ఇండియా కూటమి సహించబోదని ఆయన స్పష్టం చేశారు. జనవరి 14న మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర మహారాష్ట్ర వరకు సాగనున్నది. మార్చి 20న ముంబైలో యాత్ర ముగియనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News