Monday, April 29, 2024

మహాపండిత మేధావి సాంకృత్యాయన్

- Advertisement -
- Advertisement -

రాహుల్ సాంకృత్యాయన్ అనేకరంగాల్లో విస్తృత విశేష కృషి చేశారు. ప్రభావశీల తోడ్పాటును అందించారు. అయినా చరిత్రకారులు, తత్వవేత్తలు, రచయితలు, రాజకీయ కార్యకర్తలు ఆయనను మందకొడిగానే స్మరించుకుంటున్నారు. నేటితరం విద్యావేత్తలకు, విద్యార్థులకు రాహుల్ సాంకృత్యాయన్ ఎవరో తెలియదు. రాహుల్ సాంకృత్యాయన్ కులవంతి దేవి, గోవర్ధన్ పాండే దంపతులకు, తన అమ్మమ్మ గారి ఇంట, ఉత్తరప్రదేశ్ ఆజమ్ ఘర్ జిల్లా పాండహ గ్రామంలోసనాతన సరయుపరిణ (భూమిహార్) బ్రాహ్మణ కుటుంబంలో 1893 ఏప్రిల్ 9 న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు కేదార్ నాథ్ పాండే. రాహుల్ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. 1898లో తాత ఊరిలో ఉన్న ఒకే ఒక పాఠశాల మదరస లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉర్దూ నేర్చుకున్నారు.

ఆయన సహాధ్యాయులు అందరూ ముస్లింలే. అటు తర్వాత ఇంటి వద్దే అనేక భాషలను అభ్యసించారు. తర్వాతి కాలంలో ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నారు. తన బాల్య జీవితం గురించి తనకు ఏమీ తెలియని అతి చిన్న వయసులో రాహుల్‌కు సంతోషితో పెళ్లి జరిగింది. తన స్వీయ చరిత్ర ‘నా జీవన యాత్ర’ ప్రకారం రాహుల్ తన 40 ఏళ్లవయసులో ఒకే ఒకసారి ఆమెను చూశారు. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో బౌద్ధాన్ని బోధించమని సోవియట్ యూనియన్ రాహుల్ ను రెండవసారి ఆహ్వానించింది. ఆ కాలంలో మంగోలియన్ పండితురాలు లోలా (ఎలెనా నర్వర్తోవ్న కోజెరోవ్స్కయ)తో పరిచయమైంది. ఆమెకు ఫ్రెంచ్, ఆంగ్లం, రష్యన్ మాట్లాడటం, సంస్కృతంలో రాయడం తెలుసు.

టిబెటన్ -సంస్కృతం నిఘంటువు రచనలో ఆమె రాహుల్‌కు సాయపడ్డారు. వీరి అనుబంధం పెళ్ళికి దారితీసింది. ఈ దంపతులకు కొడుకు ఇగోర్ రాహులోవిచ్ జన్మించాడు. తనకు కేటాయించిన బోధన కార్యక్రమం ముగియగానే రాహుల్ ఇండియాకు రావలసి వచ్చింది. అయితే భార్య లోలా, కొడుకు రాహులోవిచ్ లు ఇండియా రావడానికి రష్యా ప్రభుత్వం అనుమతించ లేదు. తర్వాతి జీవితంలో నేపాలీ మహిళ హిందీ, నేపాలీ భాషలలో రచయిత, సంపాదకురాలు, పండితురాలు, అనువాదకురాలు డాక్టర్ కమల పెరియార్ (సాంకృత్యాయన్) ను రాహుల్ వివాహం చేసుకున్నారు. రాహుల్ చిన్న వయసులోనే స్పష్టంగా తెలియని కారణాలతో ఇల్లు వదిలి వెళ్లిపోయారు. సన్యాసులు, భిక్షువులతో కలిసిపోయారు. కలకత్తాలో పొగాకు కొట్టులో సహాయకునిగా పని చేశారు. సాధువుల సాంగత్యంలో గంజా తాగేవారు.

గాంధీని పెట్టుబడిదారుల ప్రతినిధి అని విమర్శించేవారు.గాంధీ హత్య తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నారు. గృహస్థులను మోసం చేసిన కపట సాధువులపై రాహుల్ వ్యాసాలు రాశారు. గంజాయి తాగే పూజారులు, యోగినుల మధ్య లైంగిక వ్యవహారాలను ఎగతాళి చేశారు. 18 వ ఏట వారణాసిలో చక్రపాణి బ్రహ్మచారి మఠంలో చేరారు. 19 వ ఏట సన్యాసి రామ్ అవతార్ శర్మ పరిచయంలో అనేక అంశాల్లో అనుభవం గడించారు. 1915 లో ఆగ్రాలో ఆర్చ్ ముసాఫిర్ స్కూల్‌లో చేరారు. ఆ సంస్థ ప్రచురించే పత్రిక ముసాఫిర్‌లోను హిందీ పత్రిక భాస్కర్‌లోనూ అనేక వ్యాసాలు రాశారు. తర్వాతి రోజులలోరాహుల్ సాంకృత్యాయన్ స్వామి దయానంద సరస్వతి స్థాపించిన వైదిక పిడివాద ఆర్య సమాజ్‌ను అనుసరించారు. హిందు సన్యాసి బాబా రామ్ ఉదార్ దాస్ పేరును తన పేరుగా మార్చుకున్నారు. తర్వాత శ్రీలంకలో బౌద్ధదీక్ష తీసుకున్నారు. బుద్ధిజం రాహుల్ జీవితాన్ని మార్చింది. దేవునిపై నమ్మకం కోల్పోయినా పునర్జన్మను నమ్మేవారు. గౌతముని కుమారుని పేరు రాహుల్ కు తన గోత్రం సాంకృత్యను జోడించి రాహుల్ సాంకృత్యాయన్‌గా పేరు మార్చుకున్నారు.

విశాలమైన నుదురు, ఎద, భుజాలతో ఆరడుగుల నిండైన విగ్రహం రాహుల్ ది. ఆయన స్వాంతంత్ర సమరయోధుడు. రచయిత. బహుళ శాస్త్రజ్ఞుడు. బహుభాషా కోవిదుడు. అయినా ప్రధానంగా హిందీలో రచనలు చేశారు. బౌద్ధ సన్యాసి జీవితం తర్వాత రాహుల్ మార్క్సిస్టు సోషలిజాన్ని అనుసరించారు. ఉదారవాద మానవవాదిగా, రాజీలేని సనాతన సంప్రదాయ వ్యతిరేకిగా మారారు. రాహుల్ హిందీ భాషా ప్రేమికులు. నేను నా పేరు, రూపురేఖలను, ఆహారపు అలవాట్లను, సంప్రదాయాలను మార్చుకున్నాను. కాని హిందీ పట్ల అభిప్రాయాలను మార్చుకోలేదు. అనేవారు. రాహుల్ ఖురాన్‌ను అరబ్బీ నుండి సంస్కృతం లోకి అనువదించారు. రాహుల్ కు లాంఛనప్రాయ విద్య చాలా తక్కువ. అయినా ఆయన పాండిత్యం, విషయ పరిజ్ఞానం, బోధనా పటిమను గమనించిన లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయం రాహుల్ ను 1937-38 లలో, తిరిగి 1947-48 లలో చరిత్ర అధ్యయన ఆచార్యులుగా నియమించుకుంది. రష్యాలోని అతిపురాతనమైన, విశాలమైన ఈప్రభుత్వ పరిశోధన విశ్వవిద్యాలయం సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో ఉంది. ప్రజా సంబంధ, ప్రజావసర పరిజ్ఞానాన్ని గుర్తించడంలో నాటి సోవియట్ యూనియన్ పేరుగాంచింది.

విస్తృతంగా ప్రపంచ పర్యటనచేసిన భారతీయ పండితులలో రాహుల్ ప్రముఖులు. 45 ఏళ్ల పాటు ప్రపంచాన్ని పర్యటించారు. ఈయనను భారతీయ పర్యాటక పితామహుడు అంటారు. సాంకృత్యాయన్ చాలా దేశాలు పర్యటించారు. అనేక పర్యాటక గ్రంథాలు రచించారు. తన పర్యాటక అనుభవాలను ప్రామాణికంగా వివరించారు. దర్శించిన ప్రదేశాల ప్రాంతీయ, చారిత్రక, సాహిత్య అంశాలను వివేచనతో, జ్ఞాన యుక్తంగా పొందుపరిచారు. పర్యటన చరిత్రకు సాహిత్య రూపం కల్పించటంలో కీలకపాత్ర పోషించారు. రాహుల్11 ఏళ్ల పాటు భారత దేశమంతా తిరిగారు. లడఖ్, కిన్నౌర్, కశ్మీర్ ప్రాంతాలలో, నేపాల్, టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, పూర్వ సోవియట్ యూనియన్ లలో పర్యటించారు. బీహార్ లోనిసారన్ జిల్లా పర్సాగఢ్ గ్రామంలో చాలా సంవత్సరాలు గడిపారు. ఆ గ్రామ ప్రవేశ ద్వారానికి రాహుల్ ద్వారం అని పేరుపెట్టారు. ఆయన ప్రయాణాలన్నీ భూమార్గాల్లోనే సాగాయి. కొన్ని దేశాలలో రహస్య రూపాలలో తిరిగారు. టిబెట్ లో బౌద్ధ సన్యాసిగా పలు మార్లు ప్రవేశించి, విక్రమశిల, నలంద విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల నుండి విలువైన చిత్రలేఖనాలు, పాళి, సంస్కృత భాషలలో వ్రాతప్రతులను తీసుకొచ్చారు. 12 వ శతాబ్దంలో అటు తర్వాత టిబెట్‌కు పారిపోయిన బౌద్ధ సన్యాసులు ఈ చిత్రలేఖనాలు, వ్రాత ప్రతులను తీసుకెళ్లారు. వీటిని 22 కంచర గాడిదలపై రాహుల్ ఇండియా తెచ్చారట.

ఆయన గౌరవార్థం పట్నా మ్యూజియంలో, ఈ వస్తువులతో, ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ సామాజిక సంస్కర్త, బహుభాషా కోవిదుడు. 30 భాషల్లో, అనేక మాండలీకాలలో ప్రావీణ్యం కలవారు. 12 భాషలలోరాయగల సామర్థ్యం ఉంది. అరబిక్, పార్శి, తమిళ్, కన్నడం లాంటి దక్షిణ భారత భాషలు, టిబెటన్, సింహలీస్, రష్యన్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల పాండిత్యం ఆశ్చర్యకరం. రాహుల్ భారతీయ శాస్త్రజ్ఞుడు, పురావస్తు శాస్త్రవేత్త. ప్రాచీన శాసనాల అధ్యయనం, శిలాశాసనాల పరిశోధన, లిపి శాస్త్రాల్లో ప్రావీణ్యతలు కలవాడు. మార్క్సిస్టు సిద్ధాంతవేత్త, సృజనశీల రచయిత. 20 ఏళ్లకే అనేక రచనలు చేశారు. జీవితపు చివరి రెండేళ్ళు మతిమరుపుతో బాధపడ్డా, అనేక అంశాల్లో 150 పైగా గ్రంథాలు రాశారు. వాటిల్లో సామాజిక శాస్త్రం, చరిత్ర, తత్వశాస్త్రం, బుద్ధిజం, టిబెటాలజి, నిఘంటువులు, వ్యాకరణం, సంపాదకత్వం, జానపద సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాలు, నాటకాలు, రాజకీయాలు, ప్రచారకర పత్రాలు, అనువాదాలు ఉన్నాయి. ఆయన చాల రచనలు ముద్రణకు నోచుకోలేదు. రాహుల్ ప్రఖ్యాత హిందీ రచనలలో ‘వోల్గా నుండి గంగా (ప్రయాణం) వరకు’ ఒకటి. ఇది కాల్పనిక చారిత్రక గ్రంథం. ఇందులో యూరేసియా పచ్చిక బయళ్ళ నుండి రష్యాలో వోల్గా నది పరీవాహక ప్రాంతం, మధ్య, దక్షిణ ఆసియాలలోని హిందుకుష్ పర్వత శ్రేణులు, హిమాలయ పర్వత ప్రాంతాలు, భారత ఉపఖండంలో ఇండోగంగానది మైదానాల మీదుగా ఆర్యుల వలసలను వివరించే 20 సంక్షిప్త కథలు ఉన్నాయి.

ఈ కథలు క్రీ.పూ. 6000 సంవత్సరంలో మొదలయి క్రీ.శ. 1942 తో ముగుస్తాయి. 1942లో గాంధీ ఆంగ్లేయులను దేశం వదిలి పొమ్మని క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెట్టారు. ఈ గ్రంథం ఆంగ్లంతో సహా అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడింది. ఇప్పటికీ ఇది అధిక సంఖ్యలో అమ్ముడు పోతోంది. రాహుల్ రచించిన ‘మధ్య ఆసియా చరిత్ర’ పుస్తకానికి 1958 లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.1963లో భారత ప్రభుత్వం రాహుల్‌ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయనకు లోతయిన పాండిత్యం ఉన్నా సామాన్యులకు కూడా అర్థమయ్యే సాధారణ హిందీలోనే గాక సంస్కృతం, పాళీ, భోజపురి భాషలలో తన రచనలు సాగించారు. రాహుల్ హిందీలో 10 నవలలు, 4 లఘు కథలు, 3 సంపుటాల్లో స్వీయ చరిత్ర, 17 జీవిత చరిత్రలు, 10 ఇతర పుస్తకాలు రచించారు. వాటిలో సింహ సేనాపతి, నా జీవన యాత్ర, కార్ల్ మార్క్, లెనిన్, స్టాలిన్, మావో సె టుంగ్, మహామానవ బుద్ధ, అక్బర్, ఋగ్వేదిక ఆర్యులు, దర్శన్ దిగ్దర్శన్, మానవ సమాజ్ ప్రధానమయినవి. ‘దర్శన్ దిగ్దర్శన్’ రెండు సంపుటాలలో ప్రపంచ తాత్విక చరిత్రను క్రోడీకరించారు. భోజపురిలో 4 నాటకాలు రచించారు. ఇవిగాక టిబెట్‌కు సంబంధించిన 7 పుస్తకాలు రాశారు. రాహుల్ సాంకృత్యాయన్ శ్రీ లంకన్ విశ్వవిద్యాలయంలో బోధన వృత్తిని అంగీకరించారు. అక్కడ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు బారినపడ్డారు. జ్ఞాపకశక్తి కోల్పోయారు. 14.04. 1963న 70 ఏళ్ల వయసులో, డార్జీలింగ్‌లో తుదిశ్వాస వదిలారు. రాహుల్ సాంకృత్యాయన్ వ్యక్తిగతంగా సేకరించిన వస్తువులను, సమాచార గ్రంథాలను, చిత్రలేఖనాలను దేశవ్యాపిత విశ్వవిద్యాలయాలు, ప్రదర్శనశాలల్లో భద్రపరిచారు. ఆయన్ను మనం సర్వదా స్మరించుకోవాలి. ఆయన రచనలను అధ్యయనం చేయాలి. పరిశోధించాలి. సమాజ ప్రయోజనానికి అనువర్తించాలి. రాహుల్ తాత్వికత నేటి సమాజానికి అత్యవసర ఆవశ్యకం. విద్యావేత్తలు, విద్యార్థులకు రాహుల్ గురించి తెలియజేయాలి.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News