న్యూఢిల్లీ : ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) కొత్త డిప్యూటీ గవర్నర్గా ఎం.రాజేశ్వర్ రావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆమోదం తెలిపిందని నోటిఫికేషన్లో తెలిపారు. నాలుగో డిప్యూటీ గవర్నర్గా ఉన్న ఎన్ఎస్ విశ్వనాథన్ స్థానంలో రావు బాధ్యతలు చేపట్టనున్నారు. 1984 నుంచి రిజర్వు బ్యాంక్తో అనుబంధం ఉన్న రావు వివిధ హోదాల్లో సేవలందించారు. 2016లో రిజర్వు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు.
దీనికి ముందు రోజు మంగళవారం ఆర్బిఐ ఎంపిసి (ద్రవ్య విధాన కమిటీ) సభ్యులను ప్రభుత్వం నియమించింది. ముగ్గురు కొత్త బాహ్య సభ్యులు అశిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, శశాంక భిడెలను ప్రభుత్వం నియమించిన తర్వాత ఆర్బిఐ పాలసీ సమీక్ష తేదీలను ఖరారు చేశారు. ఎంపిసిలో మరో ముగ్గురు సభ్యులు గవర్నర్ శక్తికాంత దాస్ (ఎంపిసి చైర్మన్), డిప్యూటీ గవర్నర్ మైఖెల్ దెవవ్రత పాత్రా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.సాగర్లు ఉన్నారు. సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1న ఆర్బిఐ సమీక్ష జరగాల్సి ఉండగా, కొత్త సభ్యులను నియమించకోని కారణంగా సమావేశాన్ని రిజర్వు బ్యాంక్ వాయిదా వేసింది. ఎంపిసి సమావేశం ఈ నెల 7 నుంచి ప్రారంభమైంది.