Sunday, April 28, 2024

పట్టణాభివృద్ధిలో మనమే మేటి

- Advertisement -
- Advertisement -

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 12అవార్డులు రాష్ట్రానికే

ప్రపంచంలోని 30 ఉత్తమ
నగరాల్లో హైదరాబాద్‌ను
నిలబెట్టాలన్నదే లక్షం కేంద్రం
పారదర్శకంగా వ్యవహరిస్తే
రాష్ట్రానికి మరిన్ని అవార్డులు
రాష్ట్రంలో 2025 నాటికే పట్టణాల్లో
50% జనాభా 141
మున్సిపాల్టీల్లో రూ.3,700 కోట్లతో
అభివృద్ధి పనులు రూ.2410 కోట్లతో 104 కొత్త లింక్ రోడ్లు
రాష్ట్రానికి మరిన్ని స్మార్ట్ సిటీలు
మంజూరు చేయాలి 111 జిఒ
ఎత్తివేతతో జంట జలాశయాలకు
ఇబ్బందులు లేకుండా చర్యలు
మూసీపై కొత్తగా 14వంతెనలు
త్వరలో మున్సిపాల్టీల్లో వార్డు
ఆఫీసర్ల పోస్టుల భర్తీ పురపాలక
శాఖ వార్షిక నివేదిక విడుదల
కార్యక్రమంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ :అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇండియాలో టాప్ 10 నగరాలు తెలంగాణ నుంచే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సంవత్సరానికి సం బంధించి పురపాలకశాఖ వార్షిక నివేదికను మంత్రి కెటిఆర్ నానక్‌రాంగూడలోని హెచ్‌సిజిఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్) కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ పేదలకు ఆత్మగౌరవ గృహ చేస్తుంది టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ అడగకున్నా ప్రతి ఏడాది ప్రగతి నివేదిక విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. అద్భుతంగా పనిచేస్తున్న మున్సిపల్, పట్టణాభివృద్ధి అధికారులను అభినందించారు. కరోనా కాలంలో మున్సిపల్ సిబ్బంది బాగా పనిచేశారని, కరోనా టీకాలు వేయడంలో మున్సిపల్ సిబ్బంది పా త్ర మరచిపోలేమని మంత్రి పేర్కొన్నారు.

రూ.వెయ్యి కోట్లతో నాలాల అభివృద్ధి

హైదరాబాద్‌లో వ్యర్థ పదార్థాలతో 62 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధీకరణ చేపట్టామన్నారు. రూ.100 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు మొత్తం ఎల్‌ఈడి లైట్లు ఏర్పాటు చేశామన్నారు. సోలార్ రూఫ్‌టాప్‌తో 27 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. నాలా అభివృద్ధి పథకం కింద రూ.వెయ్యి కోట్లతో నాలాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈసారి వరద ముప్పు ఉండదని తాను చెప్పనని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. రూ.3800 కోట్లతో కడుతున్న ఎస్‌టిపిల ద్వారా వందశాతం మురుగునీరు శుద్ధి చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ నిలుస్తుందన్నారు. మూసీనదిపై రూ.540 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి టిఎస్‌పిఏ వరకు సర్వీస్ రోడ్డు విస్తరిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఉస్మాన్ సాగర్ చుట్టూ 18 ఎకరాల్లో కొత్త పార్కు తుదిదశకు వచ్చిందన్నారు. హెరిటేజ్ భవనాలను అభివృద్ధి చేస్తామని కెటిఆర్ పేర్కొన్నారు. రూ.2410 కోట్లతో 104 కొత్త లింక్ రోడ్లను నిర్మించబోతున్నట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో 37 లింక్ రోడ్ల పనులను చేపట్టామని, ఏడు లింక్ రోడ్లను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మిగతావి తుదిదశలో ఉన్నాయన్నారు. ఉప్పల్, మెహిదీపట్నంలో స్కైవాక్‌లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.

కొత్త అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీలు…

రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలతో పాటు అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రత్యేక దృష్టితో పట్టణాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో రోడ్లు, నాలాలు, ఫ్లై ఓవర్లు నిర్మించుకున్నామని ఆయన పేర్కొన్నారు.

త్వరలో వార్డు ఆఫీసర్ పోస్టులు

141 మున్సిపాలిటీల్లో రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అన్ని పట్టణాల్లో టెన్ పాయింట్ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఉంటుందన్నారు. త్వరలో 50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ ఏడాది అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

తమిళనాడు, కేరళ తర్వాత..

తమిళనాడు, కేరళ తర్వాత తెలంగాణలో 46.8 శాతం మంది పట్టణాల్లోనే ఉంటున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. 3 శాతం భూభాగంలో 46.8 శాతం జనాభా ఉందని ఆయన వెల్లడించారు. 2050 నాటికి దేశంలోని 50 శాతం జనాభా పట్టణాల్లో ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా. కానీ, తెలంగాణలో మాత్రం 2025కే ఆ మార్పు వస్తుందని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని ఆయన తెలిపారు.

ఇళ్ల అమ్మకాల్లో 142 శాతం వృద్ధి

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల్లో 142 శాతం వృద్ధి నమోదయింని మంత్రి కెటిఆర్ తెలిపారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత 26 నెలల్లోనే ఇళ్ల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందన్నారు. 2254 శానిటేషన్ వెహికిల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. స్థిరాస్తి వ్యాపారం, ఇళ్ల నిర్మాణంలో హైదరాబాద్ ముందుకు వెళుతుందన్నారు. ఇళ్ల ధరలు కూడా దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే తగ్గినట్లుగా ఉన్నాయన్నారు. ఆఫీస్ స్పేస్ విషయంలో గత ఏడాది బెంగళూరును హైదరాబాద్ అధిగమించిందన్నారు. అన్ని రంగాల్లోనూ సమ్మిళిత అభివృద్ధితో ముందుకెళ్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని ఆయన తెలిపారు.

రాష్ట్రానికి ఎక్కువ స్మార్ట్ సిటీలు మంజూరు చేయాలి

పట్టణప్రాంత జనాభా అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ స్మార్ట్ సిటీలు మంజూరు చేయాలని, అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని మంత్రి కెటిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గడిచిన ఏడాది కాలంలో హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, పౌరసేవలు, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. నగర శివారులో ముంపు సమస్యను అధిగమించేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేస్తామన్నారు. అన్ని పట్టణాల్లో 10 నిర్ధేశిత కార్యక్రమాలను ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు.

రూ.3,800 కోట్లతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్

హైదరాబాద్, పట్టణ ప్రాంతాలను సమస్యలు లేకుండా చేయాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పురపాలక శాఖ ఎంత బాగా పనిచేసినా సమస్యలు ఉంటూనే ఉన్నాయని, వాటిని మీడియా భూతద్దంలో కాకుండా సానుకూల దృక్పథంతో చూడాలని మంత్రి కెటిఆర్ సూచించారు. చాలా కాలంగా ఇండెక్స్ అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని కేవలం దేశంలోని ఇతర నగరాలతో కాకుండా ప్రపంచంలోని 30 ఉత్తమ నగరాల్లో ఉంచాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. 103 వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు ఏర్పాటుతో పాటు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు. రూ.3,800 కోట్లతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

జంట జలాశయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు

స్వచ్ఛ సర్వేక్షణ్ కింద రాష్ట్రానికి 12 అవార్డులు వచ్చాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. కేంద్రం పారదర్శకంగా వ్యవహారిస్తే ఈ సారి మరిన్ని అవార్డులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణను కేంద్రం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తయిన పనులు కొనసాగుతున్న ఇళ్లను ఈ ఏడాది లబ్ధిదారులకు కేటాయిస్తామన్నారు. మూసీ, నాలాలపై ఇళ్లు కట్టుకున్న వారిని అక్కడకు తరలిస్తామన్నారు. వర్షాకాలం వస్తున్న తరుణంలో నాలా సేఫ్టీ ఆడిట్ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. 111జీఓలోని ఆంక్షల ఎత్తివేత నేపథ్యంలో జంట జలాశయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. స్థానిక ప్రజల దశాబ్ధాల విజ్ఞప్తుల మేరకే తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయం చేయడం తగదని మంత్రి కెటిఆర్ కోరారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను పెంచామని, దేశం మొత్తం లాక్‌డౌన్ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

సుంకిశాల నీటిని రక్షించుకోవాలి: ఎండి దానకిశోర్

జలమండలి ఎండి దానకిషోర్ మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ తో 8 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నానని ఆయన తెలిపారు.
సుంకిశాల ప్రాజెక్ట్ 100 ఏళ్ల కళ అని ఆ నీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

ప్రతి నెలా మున్సిపాలిటీల కోసం రూ.3,670 కోట్ల ఖర్చు: సత్యనారాయణ

ఎంఏయూడి డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ గతంతో పోల్చితే ఈ ఎనిమిది సంవత్సరాల్లో పట్టణాలు చాలా అభివృద్ధి చెందాయన్నారు. ప్రతి నెలా మున్సిపాలిటీల కోసం రూ.3,670 కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మెట్రో: ఎండి ఎన్వీఎస్ రెడ్డి

హైదారాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే మెట్రో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం తో నడుస్తుందని ఆయన తెలిపారు. ఎల్ అండ్ టి ఎక్కడికి వెళ్లదని, ఇక్కడే ఉంటుందని ఆయన తెలిపారు. రానున్న ఫేజ్ మెట్రో పనులను సిఎం కెసిఆర్ దిశానిర్ధేశం చేశారని, త్వరలోనే ఆ పనులపై క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News