ముంబయి: నకిలీ టిఆర్పి రేటింగ్స్ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న జాతీయ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టివి సహా మహారాష్ట్రకు చెందిన మరో రెండు లోకల్ మరాఠీ ఛానళ్ల గుట్టును ముంబై పోలీసులు బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రిపబ్లిక్ టివి సిఇఒ వికాస్ ఖాన్ చందానీని ముంబయి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మంది అరెస్టయ్యారు. రిపబ్లిక్ టివి పశ్చిమ విభాగం డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘన్ శ్యామ్ సింగ్ ను పోలీసులు గత నెలలోనే అదుపులోకి తీసుకోగా ఈ నెలారంభంలో ఆయనకు బెయిల్ లభించింది. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చి కౌన్సిల్ కోసం పనిచేసే హన్సా రీసెర్చి గ్రూప్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ లో రిపబ్లిక్ టివిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రిపబ్లిక్ టివితో పాటు మరో రెండు మరాఠా టివి ఛానళ్లు నకిలీ టిఆర్పి రేటింగులతో మోసాలకు పాల్పడుతున్నట్లు ముంబయి నగర పోలీస్ కమీషనర్ పరం వీర్ సింగ్ అప్పట్లో వెల్లడించారు.