Saturday, April 27, 2024

బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్

- Advertisement -
- Advertisement -

balka suman

 

ఆయన బతుకంతా బ్లాక్‌మెయిలే
దళితుల భూములను కబ్జా చేసిన రేవంత్ రెడ్డి కెటిఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నాడు
ఆయన నిజస్వరూపం బట్టబయలైంది
జన్వాడ ఫాంహౌస్ లీజుకు తీసుకున్నట్టు కెటిఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే చూపించారు
రేవంత్ తన భూబాగోతాలు దాచుకోడానికి కెటిఆర్‌పై బురద చల్లుతున్నాడు : బాల్కసుమన్

మనతెలంగాణ/హైదరాబాద్: భూకబ్జాలు, బ్లాక్‌మెయిల్‌కు కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని టిఆర్‌ఎస్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి బతుకంతా బ్లాక్‌మెయిల్ బతుకేనని ఆయన ఆరోపించారు. దళితుల భూములను కబ్జాచేసిన రేవంత్‌రెడ్డి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మంత్రి కెటిఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. సోమవారం టిఆర్‌ఎస్ పార్టీకార్యాలయంలో బాల్కసుమన్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నిజస్వరూపం మరోసారి బట్టబయలైందన్నారు. గోపనపల్లిలో దళితులభూములను కబ్జాచేసిన రేవంత్‌రెడ్డి దళితులకు క్షమాపణచెప్పి భూములు ఇవ్వాల్సింది పోయి మంత్రి కెటిఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని బాల్కసుమన్ మండిపడ్డారు. 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లలో భూముల వివరాలను కెటిఆర్ స్పష్టంగా చూపించారని ఆయన తెలిపారు. శేరిలింగంపల్లి మండలంలోని 8 ఎకరాల 9 గుంటల భూమి కెటిఆర్ సతీమణి పేరుమీద ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో కెటిఆర్ తెలిపారని చెప్పారు.

అయితే రేవంత్‌రెడ్డి చూపించిన స్థలానికి కెటిఆర్ సతీమణి స్థలానికి ఎలాంటి సంబంధంలేదని ఆయన తెలిపారు. ఈ రెండు స్థలాల మధ్య దూరం కూడా ఉందని వివరించారు. ఎవరిస్థలాన్నో చూపించి కెటిఆర్ సతీమణిస్థలమని రేవంత్ రెడ్డి చెప్పడం బోడిగుండుకు మెకాలికి లింకు పెట్టినట్లుందని బాల్కసుమన్ నిందించారు. అలాగే శంకర్‌పల్లి జవ్వాడలో ఫామ్‌హౌజ్‌ను లీజుకు తీసుకున్నారని ఆయన వివరించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఫామ్‌హౌజ్‌ను కెటిఆర్ లీజుకు తీసుకున్నారని వివరించారు. లీజు డబ్బులు ఫాంహౌజ్ యజమానికి ఎప్పటికప్పుడు ఇస్తున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డిపై అనేక భూబాగోతాలు బయటకు రావడంతో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక, తప్పును ఒప్పుకోలేక కెటిఆర్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని బాల్కసుమన్ ఆరోపించారు.

దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు రేవంత్‌రెడ్డి వ్యవహారం ఉందని ఆయన అన్నారు. దళితులభూములను కబ్జాచేస్తున్న రేవంత్‌రెడ్డి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని బాల్కసుమన్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి కుట్రలను ప్రజలు అర్థంచేసుకోవాలని చెప్పారు. దగుల్బాజి రేవంత్‌రెడ్డి చేసిన తప్పులకు క్షమాపణ చెప్పని పక్షంలో ప్రజలు వదిలిపెట్టరని హెచ్చరించారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి హోదాలో పేదల భూములు కబ్జాలు చేస్తూ, నేరాలకు పాల్పడుతూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బట్టబయలు అవుతున్నాయని బాల్కసుమన్ చెప్పారు. నేరాలపుట్ట రేవంత్ రెడ్డి తనను ఓడించిన పట్నం నరేందర్‌రెడ్డిని మరువలేక పట్నం గోస అనే కార్యక్రమం పెట్టుకున్నారని నిందించారు.ఈ మీడియాసమావేశంలో శాసనమండలి సభ్యులు శంబీపూర్‌రాజు. ఎం.శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

రేవంత్‌రెడ్డి అరెస్టు నార్సింగ్ పిఎస్‌కు తరలింపు
మంత్రి కెటిఆర్ అక్రమంగా ఫామ్‌హౌజ్ నిర్మిస్తున్నారని ఆరోపించి జవ్వాడకు వెళ్లుతున్న మల్కాజిగిరి ఎంపి రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. గండిపేట చేరువుకు వెళ్లేదారిలోని జవ్వాడ ప్రాంతంలో ఈ అరెస్టులు జరిగాయి. కెటిఆర్‌పై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి గోపనపల్లి దళితుల భూకబ్జాకేసులో నిందితుడిగా ఉన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుచర్యాల్లో భాగంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Revanth Reddy is brand Ambassador for Blackmail
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News