Monday, April 29, 2024

రైతు వ్యతిరేక వైఖరితోనే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: రైతు వ్యతిరేక వైఖరితోనే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. నేడు ఉచిత కరంటు వద్దంటున్నారు. కాంగ్రెస్‌ని నమ్మితే రైతు బీమా పథకం వద్దంటారు, రైతు బంధు, ధరణి వద్దంటారన్నారు. రూ. 2000 పింఛన్‌ను రూ. 200లకు తీసుకొస్తారన్నారు. కల్యాణలక్ష్మి రద్దుచేస్తారు. పథకాలన్నీ ఆపేసి పైసలు వాళ్ల జేబుల్లో వేసుకుంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచి అవార్డులు అందుకున్న పథకాలన్నింటిని తీసేస్తారన్నారు. గంటలో ఎకరం ఎలా పారుతుందో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరంటు ఎలా సరిపోతుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.
మళ్లీ రైతులను అగాధంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతుందని,రైతుల పంటలు ఎండి ఆత్మహత్యలు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందన్నారు. మా హయంలోనే రైతులను ఉద్దరించామని చెప్పే కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్ రేంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రోడ్ల మీదకొచ్చి నిరసన తెలపాలన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండించే దమ్ము కాంగ్రెస్ నేతలకుందా అన్నారు. పీసీసీ అధ్యక్షుడే ఈ మాట మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ విధానం అర్థం చేసుకోవచ్చన్నారు. పూర్తిగా రైతు వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ మారిందన్నారు. నాడు బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిన చంద్రబాబు ఎజెండాను నేడు తన వ్యాఖ్యలతో గుర్తు చేస్తున్నాడన్నారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబు ఎజెండాను ఇక్కడ అమలుచేస్తున్నాడన్నారు. డిక్లరేషన్ల పేరుతో వేదికలపై ఉపన్యాసాలు దంచిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలపై స్పందించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ వైఖరి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. వీళ్లని నమ్మితే మళ్లీ రైతులకు యమ పాశంగా మారుతారన్నారు. దేశం గర్వించిన 24 గంటల ఉచిత కరంటు పథకం ఎత్తివేయాలనడం హేయమైన చర్య అని కాంగ్రెస్ పతనానికి ఇదే నాంది అన్నారు. రేంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తీవ్రంగా పరిగణిస్తున్నామని, రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. నేడు ఉదయం 10 గంటలకు నర్సంపేట వ్యాప్తంగా 179 గ్రామపంచాయతీల్లో నిరసన కార్యక్రమం ఉంటుందని అందరూ స్వచ్ఛందంగా పాల్గొని నిరసన తెలపాలన్నారు. నేను ఈ నిరసనలో భాగస్వామినవుతానన్నారు. ఖానాపురం మండలం వేపచెట్టుతండాలో నేను నిరసన కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. అందరూ పెద్ద ఎత్తున హాజరై రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News