Sunday, April 28, 2024

లోక్‌సభ ఎన్నికల తరువాత బిజెపిలోకి రేవంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ జోస్యం చెప్పారు. మంగళవారం జరిగిన ముస్తాబాద్, తంగళ్లపల్లి పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే, హిమంత బిశ్వ శర్మ అవుతారని వ్యాఖ్యానించారు. ‘లోక్‌సభ ఎన్నికలకు రెండు నెలల స మ యం కూడా లేదు. భవిష్యత్తులో మీ ఆ శీర్వాదం ఉండాలి అంటే ఏమన్న ట్టు? నువ్వే మళ్లీ ప్రధాని అని మోడీకి చెప్పినట్టా? కాదా? గుజరాత్ మోడల్ అం టూ రేవంత్ తెలంగాణను అవమానించారు’ అని కెటిఆర్ మండిపడ్డారు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు రోడ్డున పడ్డారని ఆరోపించారు. కెసిఆర్‌పై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేస్తున్నారని, తనపై కోపంతో బతుకమ్మ చీరలను ఇవ్వక నేతన్నల బతుకులను ఆగం చేస్తున్నరని మండిపడ్డారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలని సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కోరితే పైనుండి ఆదేశాలు ఉన్నందువల్ల ఇవ్వడం లేదని అన్నారని తెలిపారు. తమ పదేళ్ల పాలనలో సిరిసిల్ల నేతన్నల బతుకులు బాగు చేయాలని బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి బతుకుతెరువు చూపితే కాంగ్రెస్ వారు తనపై కోపంతో నేతన్నలకు బతుకుదెరువు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌పై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద ఉన్న 86 పిల్లర్లలో ఒక్కటి కుంగిపోతే దానిని రాద్ధాంతం చేస్తున్నారని, ప్రాజెక్టును అపహస్యం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
పంటలు ఎండిపోతున్నా నీళ్లివ్వడం లేదు…
పంటలు ఎండిపోతున్నా రైతులకు నీళ్లివ్వడం లేదని, నేతన్నలకు ఉపాధి కల్పించే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలకు ఇప్పటికే మొహం మొత్తిందన్నారు. ప్రజలు తాము తప్పు చేశామని, కెసిఆర్ గొప్పతనమేంటో అర్థమవుతోందని అంటున్నారని అన్నారు. సిరిసిల్లలో తనపై నాలుగుసార్లు పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కెకె మహేందర్ రెడ్డి నేతన్నలను దొబ్బితిన్నారని, నిరోధ్‌లు, పాన్‌పరాగ్‌లు అమ్ముకొని బతకాలని వ్యంగ్యంగా అంటున్నారని మండిపడ్డారు. నేతన్నల బాధలు వెలికితెచ్చే ప్రయత్నం చేసిన జర్నలిస్టును సన్నాసి అని తిట్టాడని తమకు తిట్టడం చేతకాదా అంటూ రేవంత్ రెడ్డి మొదలుకొని కెకె మహేందర్ రెడ్డి వరకు తాను కూడా దగుల్బాజీలు, సన్నాసులు, చేతకాని వెధవలు అంటానన్నారు. గత ఏడాది డిసెంబర్ 9 నాటికే రైతుల ఖాతాల్లో రైతుబంధు రూపాయలు వేస్తామన్న రేవంత్‌రెడ్డి మార్చి 9 వస్తున్నా నేటి వరకు రైతు బంధు పైసలు వేయలేదన్నారు. అప్పుడే కరెంట్ కోతలు మొదల య్యాయన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని, ఇప్పుడు కెసిఆర్ విలువేంటో అందరికీ అర్థం అవుతోందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ బిఆర్‌ఎస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని, అందుకు ఎవరూ భయపడవద్దని ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ కోసం గులాబీ జెండా, కెసిఆర్ దళం నిరంతరం పోరాటం సాగిస్తుందని, రానున్న 5 నెలలు ప్రతిపక్ష పార్టీగా బిఆర్‌ఎస్‌కు మొదటి పరీక్షా సమయమని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బి.వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. కరీంనగర్ ఎంపిగా ఉన్న బండి సంజయ్ నిరంతరం హిందూ, ముస్లిం జపం తప్ప మరేం చేయలేదన్నారు. మతం పేరిట యువతలో విషం నింపారన్నారు. దేవుని గురించి, ధర్మం గురించి ప్రచారం చేసుకోదలిస్తే మఠం పెట్టుకుని సన్యాసాశ్రమం నడుపుకోవాలని హితవు పలికారు. రోడ్లు, విద్యాలయాలు, దేవాలయాలు, వైద్యశాలలు, సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇలా ఏదీ సాధించలేదన్నారు. మోడీ పదేళ్ల పాలనలో ఐదేళ్లు తమ అభ్యర్థి వినోద్‌కుమార్ ఎంపిగా ఉన్నారని, మరో ఐదేళ్లు బండి సంజయ్ ఉన్నారని, ఐదేళ్లలో చేసిన అభివృద్ధిపై నియోజక వర్గంలో ఎక్కడైనా ముఖాముఖిగా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తమ హయాంలో యాదాద్రి గుడి కట్టామని, తాము గుడి, మత రాజకీయాలను ఓట్ల కోసం వాడుకోవడం లేదన్నారు. రేవంత్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కెసిఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి తాము నియామకాలు చేసినట్లుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి దగుల్బాజీ పాలన మానుకోవాలన్నారు. నీతి, నిజాయితీతో పాలించాలన్నారు. ‘3 నెలల్లో ఏం సాధించావో అది చెప్పుకో’ అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను తెచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ వారు ఇప్పుడు అదే ఎల్‌ఆర్‌ఎస్‌ను ఈ నెల 31లోగా డబ్బు చెల్లించాలని మెడపై కత్తిపెట్టారని, అందువల్ల దానిని వ్యతిరేకిస్తూ సిరిసిల్లలో బుధవారం భారీ ధర్నాను నిర్వహిస్తున్నదని, అంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 12న కరీంనగర్‌లో కెసిఆర్ కదనభేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి తెలంగాణలో మళ్లీ పుంజుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News