విధుల్లో కరోనాతో చనిపోయిన వైద్యసిబ్బంది కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్గ్రేషియా
మంత్రి ఈటల ప్రకటన, కృతజ్ఞతలు తెలిపిన వైద్యసంఘాలు
మన తెలంగాణ/హైదరాబాద్:కోవిడ్తో చనిపోయిన వైద్యసిబ్బందికి రూ.75 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కేంద్రం అందించే రూ.50 లక్షలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షలను అందిస్తామని ఆయన తెలిపారు. బిఆర్కేభవన్లో వివిధ డాక్టర్ల సంఘాలతో మంత్రి మంగళవారం సమావేశం అయ్యారు. వైద్యసంఘాలు విజ్ఞప్తులపై సిఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ…కరోనా సోకిన వైద్యసిబ్బందికి నిమ్స్ అసుపత్రిలో పూర్తిస్థాయిలో చికిత్సను అందిస్తామన్నారు. అదే విధంగా కోవిడ్ వలన అనారోగ్యం బారిన పడిన వారిని ఆన్డ్యూటీగా పరిగణిస్తామని తెలిపారు. వైద్యశాఖలో క్రిందిస్థాయి పోస్టు నుంచి పై స్థాయి వ్యక్తి వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అన్నారు.
కృతజ్ఞతలు తెలిపిన మెడికల్ జేఏసి..
కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వైద్యసిబ్బందికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి ఈటల రాజేందర్కు, ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. కోవిడ్ యుద్ధంలో చనిపోయిన ప్రతి వైద్యసిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షలు ఇవ్వడం సంతోషకరమన్నారు. అయితే దీన్ని రెట్టింపు చేయాలని తాము విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జేఎసి స్టేట్ కన్వీనర్ డా బొంగు రమేష్, డా నరహారి, వెంకటేశ్వరరెడ్డి, జూపల్లి రాజేందర్, రఘు, రవుఫ్, రమేష్, శ్రీనివాస్, మహేష్, యకధర్రెడ్డి, రాబార్ట్ బ్రూస్ తదితరులు పాల్గొన్నారు.
హర్షం వ్యక్తం చేసిన పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈసందర్బంగా డా రవిశంకర్ చైర్మన్ మాట్లాడుతూ..కోవిడ్ సోకిన వైద్యసిబ్బందికి భరోసా ఇవ్వడం పట్ల ఆనందంగా ఉందన్నారు. అయితే తెలంగాణ గ్రామీణ ప్రజలకు స్పెషలిస్టు వైద్య సేవలు అందిస్తే అతి త్వరలోనే ఆరోగ్య తెలంగాణ మారుతుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఆ దిశగా ప్రణాళిక చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక 10 సిఎం స్పెషల్ ప్రోత్సాహక ప్రక్రియను కూడా హెల్త్ కేడర్ అందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు డాక్టర్ కత్తిజనార్థన్, డా షరీఫ్, డా అభిరామ్, డా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Rs 75 lakh ex-gratia for medical personnel died with covid