న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులపై సోషల్ మీడియాలో కించపరిచే, అగౌరవపరిచే, నీచమైన, వ్యంగ్య వ్యాఖ్యలు పోస్టు చేసిన పార్లమెంట్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఒక డిప్యుటీ డైరెక్టర్ను రాజ్యసభ డిమోట్ చేసింది. ఈ మేరకు రాజ్యసభ ఉత్తర్వులు జారీచేసింది. సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్లు పెట్టినందుకు పార్లమెంట్కు చెందిన ఒక అధికారిపై ఇటువంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. పార్లమెంట్ సెక్యూరిటీ విభాగం డిప్యుటీ డైరెక్టర్ ఉరుజుల్ హసన్ను ఐదేళ్లపాటు కింది స్థాయి భద్రతాధికారిగా డిమోట్ చేస్తున్నట్లు ఫిబ్రవరి 12న జారీచేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం తెలిపింది. 2018 జూన్ నుంచి హసన్ సస్పెన్షన్లో ఉన్నారు. రాజ్యసభ డైరెక్టర్ కె సుధాకరన్ సంతకంతో వెలువడిన ఈ నోటిఫికేషన్లో ఐదేళ్ల తర్వాత కూడా హసన్ తన పూర్వ పదవిని పొందడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ పేరిట పార్లమెంట్కు ప్రత్యేక భద్రతా విభాగం ఉంది. దీనికి ఐపిఎస్ అధికారి నేతృత్వం వహిస్తారు. పరీక్షల ద్వారా అధికారులను సర్వీసులో నియమిస్తారు.