కోచి : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారని సంఘ్ పరివార్ వర్గాలు తెలిపాయి. అక్కడ ఆయన ఆయుర్వేద చికిత్స తీసుకున్నారు. 93 ఏళ్ల పరమేశ్వరన్ భారతీయ విచార కేంద్రం వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేశారు. ఆ సంస్థ ద్వారా కేరళవాసుల్లో జాతీయ భావజాలాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. ఒకప్పటి భారతీయ జనసంఘ్ నాయకుడైన పరమేశ్వరన్ అలనాటి ప్రముఖులు దీన్దయాళ్ ఉపాధ్యాయ, అతల్ బిహారీ వాజ్పాయి, ఎల్కె అద్వానీ వంటి దిగ్గజాలతో పనిచేశారు. 2018లో ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ తో గౌరవించింది. 2004లో పరమేశ్వరన్కు పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోడీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలైన నాయకులు సంతాపం తెలిపారు. భారతమాత గర్వించదగ్గ తనయుడు అని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. పరమేశ్వరన్ స్వస్థలం అలప్పుజ లోని మహమ్మలో సోమవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని సంఘ్ నాయకులు తెలిపారు.
RSS ideologue Parameswaran passed away