హెల్సింకీ: అఫ్ఘన్లో కీలక పరిణామాల నేపథ్యంలో బుధవారం అమెరికా, రష్యా అత్యున్నత స్థాయి సైనికాధికారుల భేటీ జరిగింది. అఫ్ఘన్ ఇరుగుపొరుగుదేశాలలో ఉగ్రవాద కట్టడి దిశలో సైనిక స్థావరాల ఏర్పాట్లు, హక్కుల దిశలో అమెరికా పావులు కదుపుతోంది. దీనిని రష్యా అడ్డుకొంటోంది. ఈ క్లిష్టతను నివారించేందుకు ఇరు పక్షాల సమావేశం జరిగింది. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో జరిగిన ఈ సమావేశంలో అమెరికా సంయుక్త దళాల అధినేత జనరల్ మార్క్ మిల్లే, రష్యా సైనికాధికారి జనరల్ వాలేరి గెరసిమోవ్ను కలుసుకున్నారు. ఇప్పుడు అఫ్ఘనిస్థాన్లో నెలకొన్న పరిస్థితులలో ఉగ్రవాదం తిరిగి వేళ్లూనుకోకుండా చూడాల్సి ఉందని అమెరికా ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షక సైనిక బలగాలు లేకపోతే తిరిగి అఫ్ఘన్ కేంద్రంగా పలు ఉగ్రవాద శక్తులు తలెత్తుతాయని, అల్ఖైదా, ఇతరత్రా మిలిటెంట్లు ఉనికి చాటుకుంటే అది అమెరికాకు, మిత్రపక్షాలకే కాకుండా ప్రపంచ శాంతికి విఘాతం ఏర్పడుతుందని కీలక ప్రాంతాలలో తమ సైనిక స్థావరాలకు అధికారిక హక్కులు అత్యవసరం అని అమెరికా ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ వాదనను రష్యా చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. తమ కోణంలో ఇది శ్రేయస్కరమైన విషయం కాదని, పలు సమీకరణలను దెబ్బతీస్తుందని తెలిపింది. ఈ తరుణంలో ఇప్పుడు ఇక్కడ జరిగిన భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను వివరించేందుకు జనరల్ మిల్లే నిరాకరించారు. అయితే ఇరుదేశాల మధ్య సైనికాధికారుల స్థాయి సమన్వయం, సమాచార వినిమయం దిశలో చర్చల ప్రక్రియ సాగుతోందని మిల్లే ప్రతినిధి కల్నల్ డావే బట్లర్ తెలిపారు. ఫిన్లాండ్లో ఇప్పటి భేటీ ఇందులో భాగమే అని చెప్పారు.