ఒమన్లో అఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు?
మాస్కో /కాబూల్ : తాలిబన్ల ఆక్రమణతో అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ ఆదివారం దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రష్యా ఘనీపై సంచలనవ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ భారీగా నగదు నిండిన నాలుగు కార్లతో పలాయనం చిత్తగించాడని పేర్కొంది. అంతేకాదు హెలికాప్టర్లో డబ్బు మూటలు పట్టకపోవడంతో కొంత నగదును విడిచి పోవాల్సి వచ్చిందంటూ కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించడంతో ఘనీ నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా నగదు, దేశం విడిచి పారి పోయాడని రష్యా వ్యాఖ్యానించింది. రక్తపాతాన్నినివారించాలని భావించినట్టు పేర్కొన్నాడని తెలిపింది. రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో రాయిటర్స్తో తన వ్యాఖ్యలను ధృవీకరించారు. నాలుగుకార్లు డబ్బుతో నిండి ఉన్నాయి, డబ్బులో కొంత భాగాన్ని హెలికాప్టర్లో నింపడానికి ప్రయత్నించారు, కానీ సరిపోక పోవడండతో రన్వేపైనే వదిలేశారన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఘనీ వెంట ఆఫ్ఘన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు హమ్ దుల్లా మొహిబ్ కూడా ఉన్నారు. ఘనీ ఇక అమెరికాలో సెటిల్ కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన విషయంలో అమెరికా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.