మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదవీకాలాన్ని 2036 వరకు పొడిగించడానికి అనుమతించే రాజ్యాంగ సవరణలపై వారం రోజుల పాటు వోటింగ్ గురువారం దేశంలో ప్రారంభమైంది. పుతిన్ ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదించిన కొన్ని రాజ్యాంగ సవరణలపై గత ఏప్రిల్ 22న ఎన్నికలు జరగవలసి ఉండగా కరోనా వైరస్ ఉధృతి కారణంగా వాయిదాపడ్డాయి. ఆ తర్వాత ఎన్నికలను జులై 1కి మార్చడం జరిగింది. ప్రజలు రోడ్లపైకి పెద్ద సంఖ్యలో రాకుండా నివారించడానికి వారం రోజుల ముందుగానే పోలింగ్ కేంద్రాలను ప్రారంభించారు.
ప్రతిపాదిత రాజ్యాంగ సవరణల ప్రకారం ఇప్పటికే రెండు దశాబ్దాలకు పైగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న 67 సంవత్సరాల పుతిన్ మరో 12 ఏళ్లపాటు రెండు పర్యాయాలు పదవిలో కొనసాగే అవకాశం లభిస్తుంది. పుతిన్ ప్రస్తుత పదవీకాలం 2024తో ముగియనున్నది. ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు కొనసాగే విధంగా రాజ్యాంగ సవరణలు చేపడుతున్నారు. సామాజిక ప్రయోజనాలను మెరుగుపరచడం, పురుషుడు, స్త్రీల సహజీవనాన్ని వివాహంగా నిర్వచించడం, ప్రభుత్వంలో పాలనా అధికారాలను వికేంద్రీకరించడం, అధ్యక్ష పదవిని బలోపేతం చేయడం వంటివి ప్రతిపాదిత ఇతర రాజ్యాంగ సవరణలు. ఈ మార్పులను పార్లమెంట్ ఉభయ సభలు, అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ఆమోదించాయి. వీటికి అధ్యక్షుడు పుతిన్ చట్టబద్ధత కూడా తీసుకువచ్చారు. అయితే, న్యాయపరంగా అవసరం లేనప్పటికీ ఈ చట్టంపై ప్రజల తీర్పు వోటు రూపంలో కోరాలని పుతిన్ పట్టుబట్టడంతో పోలింగ్ అనివార్యమైంది.