Monday, April 29, 2024

సుప్రీం ఆదేశాలను శిరసావహించిన ఎస్‌బిఐ

- Advertisement -
- Advertisement -

ఇసికి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పణ
మార్చి 15న ఇసి వెబ్‌సైట్‌లో బాండ్ల వివరాలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల కొనుగోలుదారులు, స్వీకరణదారుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బిఐ) మంగళవారం సాయంత్రం సమర్పించింది. మార్చి 12(మంగళవారం)వ తేదీన వ్యాపార లావాదేవీలు(బిజినెస్ అవర్స్) ముగిసేలోగా ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని సోమవారం సుప్రీంకోర్టు ఎస్‌బిఐని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ ఎస్‌బిఐ సమర్పించిన ఎన్నికల బాండ్ల వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా పొందుపరచాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15న, మార్చి 11న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఎస్‌బిఐ మార్చి 12న (మంగళవారం) ఎన్నికల కమిషన్‌కు అందచేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఎన్నికల కమిషన్ తెలిపింది. 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తన 30 శాకల ద్వారా ఎస్‌బిఐ రూ. 16,518 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను జారీచేసింది.

కాగా..ఫిబ్రవరి 15న వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. దాతల పేర్లు, వారి విరాళాల మొత్తం, వాటి గ్రహీతల పేర్లను వెల్లడించాలని ఎస్‌బిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా..వివరాల వెల్లడికి తమకు జూన్ 30 వరకు గడువు పెంచాలని ఎస్‌బిఐ చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. మంగళవారం బిజినెస్ అవర్స్ ముగిసేలోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బిఐని ఆదేశించింది. ఇదిలా ఉండగా కాలాన్ని వృథా చేసేందుకు ఎస్‌బిఐ వేసిన ఎత్తుగడ హాస్యాస్పదంగా ఉందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌సి గర్గ్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు కోరనప్పటికీ బాండ్ల కొనుగోలుదారుడిని, ఆటినిఅందుకున్న రాజకీయ పార్టీని జతచేయడానికి ఎస్‌బిఐ పూనుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అటువటి బాండ్లకు సీరియల్ నంబర్ కాని ఇతర ఏటువంటి గుర్తులు కాని ఉండవని ఆయన తెలిపారు. బాండ్ల కొనుగోలు, వాటి డిపాజిట్ ప్రక్రియను రికార్డు చేసే అవకాశం ఎస్‌బిఐకి లభించదని, ఏ బాండును ఎవరు కొన్నారో, ఎవరు డిపాజిట్ చేశారో గుర్తించడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 జనవరి 2న ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

రాజకీయ నిధుల సమీకరణలో పారదర్శకతను తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా నగదు విరాళాల స్థానంలో ఎన్నికల బాండ్లను ప్రభుత్వం తీసుకువచ్చింది. 2018 మార్చిలో ఎన్నికల బాండ్ల తొలి అమ్మకం జరిగింది.తమ అధికారిక బ్యాంకు ఖాతాలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్లను డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఈ బాండ్లను జారీచేసే అధికారం కేవలం ఎస్బిఐకి మాత్రమే ఉంది. భారతదేశానికి చెందిన పౌరులు, సంస్థలు మాత్రమే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడానికి అర్హులు. గత లోక్‌సభ ఎన్నికలలో లేదా అసెంబ్లీ ఎన్నికలలో ఒక శాతానికి మించి ఓట్లు పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు సేకరించడానికి అర్హులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News