న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 ఏండ్లు. జస్టిస్ మోహన్ క్యాన్సర్తో బాధపడుతూ ఇటీవల న్యుమోనియా బారినపడ్డారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఉన్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, గత సంవత్సరం మృతి చెందిన ఆయన తల్లిని ఖననం చేసిన చోటనే తననూ ఖననం చేయాలనేది జస్టిస్ శాంతనగౌడర్ చివరి కోరిక అని కుటుంబీకులు వెల్లడించారు. 2016 సెప్టెంబర్ లో కేరళ హైకోర్టు సిజెగా జస్టిస్ శాంతనగౌడర్ పనిచేశారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. 2023 మే 4వరకూ ఆయన పదవిలో కొనసాగనున్నారు. 1958 మే 8న కర్నాటకలో మోహన్ శాంతనగౌడర్ జన్మించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
SC Justice Mohan M Shantanagoudar passed away