ప్రైవేట్ ఆస్పత్రిలో యువతికి చికిత్స
ఎస్సైని సస్పెండ్ చేసిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్ : వివాహం చేసుకుంటానని చెప్పి ఎస్సై మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని టపచపుత్ర పోలీస్ స్టేషన్లో మధు ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎస్సైకి వివాహం గతంలోనే వేరే యువతితో జరిగింది. ఈ విషయం దాచిపెట్టిన ఎస్సై మధు బేగంపేటకు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహం చేసుకుంటానని సదరు యువతికి మాయమాటలు చెప్పడంతో నమ్మిన బాధితురాలు ఎస్సైతో శారీరక సంబంధం పెట్టుకుంది.
తాజాగా ఎస్సై మధుకు ఇదివరకు వివాహం జరిగిందనే విషయం తెలియడంతో బేగంపేట, వెస్ట్జోన్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసింది. మానసికంగా కుంగిపోయిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ యువతిని వివాహం చేసుకుంటానని మోసం చేసిన ఎస్సై మధును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.