Thursday, May 16, 2024

కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సింగపూర్ ప్రధాని లీ

- Advertisement -
- Advertisement -

Singapore PM Lee receives Covid-19 vaccine

సింగపూర్: సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ శుక్రవారం కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తన మంత్రివర్గంలో అందరికన్నా ముందు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 68 సంవత్సరాల లీ ప్రజలందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని కరోనా మహమ్మారిని జయించాలని పిలుపునిచ్చారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన ఆరోగ్య, వైద్య సిబ్బందికి అందచేసేందుకు శుక్రవారం కరోనా వ్యాక్సిన్‌ను అధికారికంగా ప్రారంభించారు. సింగపూర్ జనరల్ ఆసుపత్రి(ఎస్‌జిహెచ్) సిబ్బందితోపాటు వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని లీ అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే తాను ముందుగా టీకా వేసుకున్నానని తెలిపారు.

ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ను చేతికి వేయించుకున్న లీ ఇందుకు సంబంధించిన ఫోటోను తన అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో షేర్ చేశారు. టీకా వేయించుకున్న తర్వాత అరగంట అక్కడే వేచి ఉన్నానని, తనకేమీ కాలేదని ఆయన ప్రజలకు ధైర్యం చెప్పారు. సింగపూర్‌లో కరోనా వైరస్ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చింది. అయితే తాజా కేసులు మాత్రం విదేశాల నుంచి వస్తున్న వారి కారణంగా సంభవిస్తున్నాయి. సింగపూర్‌లో ఇప్పటివరకు మొత్తం 58,836 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా ఇందులో 58,562 మంది కోలుకున్నారు. సింగపూర్‌లో మొత్తం 29 మంది వైరస్ కారణంగా మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News