Monday, April 29, 2024

గాయని కెఎస్ చిత్రపై ఆన్‌లైన్ దాడి

- Advertisement -
- Advertisement -

రామనామాన్ని జపించమన్నందుకు విమర్శలు

న్యూఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రాణప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ప్రజలు రామనామాన్ని జపించడంతోపాటు ఆ రోజు సాయంత్రం దీపాలు వెలిగించాలంటూ ప్రముక సినీ గాయని కెఎస్ చిత్ర ఇచ్చిన పిలుపుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రతిఒక్కరూ శ్రీరామ జయరామ, జయ జయ రామ అంటూ రామ మంత్రాన్ని జపించాలి.

అదే విధంగా ఇంట్లో ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించి ప్రతిఒక్కరికి దేవుడి ఆశీస్సులు అందాలని ప్రార్థించాలి..లోక సమస్త సుఖినో భవంతు అంటూ గానకోకిలగా దక్షిణాదిలో పేరుగాంచిన చిత్ర ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తగా ఆమెకు మద్దతుగా కూడా పలువురు నిలబడ్డారు. చిత్ర వీడియో సందేశంపై గాయకుడు సూరజ్ సంతోష్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పే వారి అమాయత్వమే ఇక్కడ గొప్ప విశేషమని, మసీదును ధ్వంసం చేసి ఆలయాన్ని నిర్మించిన వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా మరిచిపోతుంటారని వ్యాఖ్యానించారు.

ఒకదాని వెంబడి మరొకటి ఇలా ఎన్ని విగ్రహాలు పగులతాయో..ఎందరు కెఎస్ చిత్రాలు తమ నిజస్వరూపాలను బయటపెట్టుకుంటారో..అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరికొందరు నెటిజన్లు కూడా ఆమె ఒక రాజకీయ పక్షం వైపు మొగ్గుచూపడాన్ని తప్పుపట్టారు. కాగా..మరో గాయకుడు జి వేణుగోపాల్ గాయని చిత్ర వ్యాఖ్యలను గట్టిగా సమర్థించారు. తన అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఆమకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆమె మనోభావాలను గాయపరిచే విధంగా కొందరు విమర్శలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు. ఆమె వ్యాఖ్యలపై ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఆమెను క్షమించి ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని ఆయన తన ఫేస్‌బుక్ పోస్టులో విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా..ఇటీవల ప్రముఖ నటి శోభన కూడా సోషల్ మీడియాలో విమర్శల దాడికి గురయ్యారు. ఇటీవల కేరళలోని త్రిసూర్‌లో మహిళా సాధికారతపై జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో కలసి పాల్గొన్నందుకు ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News