గ్రామం సందర్శించిన ఉన్నతాధికారులు
బాధితురాలి బంధువుల ప్రశ్నలపై దృష్టి
సందర్శకుల రాకకు ఆంక్షలతో అనుమతి
లక్నో : ప్రకంపనలు పుట్టిస్తోన్న యుపి హత్రాస్ రేప్, బాధితురాలి మరణం ఘటనపై యుపి అదనపు చీఫ్ సెక్రెటరీ (హోం) అవనీష్ అవస్థీ శనివారం స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు అయింది. తమ దర్యాప్తు క్రమంలో సిట్ ఈ దళిత మహిళ మృతికి దారితీసిన పరిస్థితులతో ముడివడి ఉన్న అనేక అంశాలపై ఆరాతీస్తుందని అవస్థీ వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలను సిట్ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. వీటిపై ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతుందని అవస్థీ శనివారం తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లే ప్రజా ప్రతినిధులకు అందుకు వీలు కల్పిస్తున్నట్లు, అనుమతిని ఇస్తున్నట్లు చెప్పారు, అయితే గ్రామానికి వెళ్లే వారు ఐదుగురు కన్నా ఎక్కువగా ఉండకూడదని, ఒక్కసారి కేవలం ఐదుగురే వెళ్లి కుటుంబాన్ని పరామర్శించవచ్చునని ఈ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.
శనివారం అవస్థీతో పాటు యుపి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హెచ్సి అవస్థీ కూడా గ్రామానికి వెళ్లారు. బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో దాదాపు అరగంట పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పలు విషయాలను ప్రస్తావించారు. వీటిని తాము పరిగణనలోకి తీసుకున్నట్లు , జరిగిన ఘటన చాలా బాధాకరం, అవాంఛనీయం అని అధికారులు తెలిపారు. నేరస్తులను వదిలేది లేదని వారిని చట్టప్రకారం శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు ఉన్నతాధికారులు హామి ఇచ్చారు. సిట్ ఏర్పాటు అయిందని, ఇందులో సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారని అవస్థీ వివరించారు. ఇప్పటికే సిట్ తన దర్యాప్తు చేపట్టింది. శుక్రవారం సాయ్రంతమే ప్రాధమిక నివేదికను అందించింది. ఇందులోని అంశాల ప్రాతిపదికనే హత్రాస్ ఎస్పి, సిఐ, ఎస్ఐ ఇతరులపై వేటుపడింది. వారిని సస్పెండ్ చేశారని తెలిపారు.