భద్రాచలంలో మొత్తం 40 మందికే అనుమతి
భక్తులు ఎవరూ రావద్దని ఆలయవర్గాల ప్రకటన
మన తెలంగాణ/భద్రాచలం : కరోనా నేపథ్యం లో శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిదేవస్థానంలో నేడు జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు ఎవరూ రావద్దని భద్రాచలం ఎఎస్పి రాజేష్చంద్ర సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులకు అనుమతి నిరాకరించడం జరిగిందని, ఈ క్రమంలో భక్తులు ఎవరూ భద్రాచలం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో సంచరించరాదని ఆయన స్పష్టం చేశారు. దేవస్థానానికి వెళ్లే అన్ని మార్గాలు మూసివేయడం జరిగిందని చెప్పారు. స్వామివారి కల్యాణానికి అర్చకస్వాములు, పండితులు, ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు తెచ్చే కొందరు ప్రజాప్రతినిధులను ఇలా 40మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.ఈ ఏడాది కరోనా నేపథ్యంలో శ్రీసీతారాముల కల్యాణం భద్రాద్రి దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా జరుగుతుందని వెల్లడించారు.
అలాగే శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయంలో మినహా మరే ఇతర ఆలయాల్లోనూ శ్రీసీతారాముల కల్యాణ వేడుకలను నిర్వహించరాదని ఆయన పేర్కొన్నారు. అలాగే అన్నదానం, బెల్లం పానకం, మంచినీటి పంపిణీ వంటి కార్యక్రమాలకు కూడా అనుమతిలేదని పేర్కొన్నారు. వాహనాలను అనవసరంగా భద్రాచలం దేవస్థానం పరిసరాల్లోకి తీసుకురావద్దని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లాక్డౌన్ దృష్టా దేవస్థానం చుట్టు పక్కల దుకాణాలు ఎప్పటిలాగే తప్పనిసరిగా మూసిఉంచాలని చెప్పారు. అలాగే మీడియాకు సైతం అనుమతి లేదని, స్వామివారి కల్యాణాన్ని లైవ్టెలికాస్ట్కు మాత్రమే ఎసిఇ మీడియాకు మాత్రమే అనుమతిచ్చామని ఆయ న తెలిపారు. మిగిలినవారు ఎసిఇ మీడియా నుంచి స్ట్రీమింగ్, ఫొటోలు తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా దృష్టా ప్రజలు అర్ధం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.