Monday, May 6, 2024

యువతకు భరోసా టిఆర్‌ఎస్సే: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

యువతకు భరోసా టిఆర్‌ఎస్సే
పార్టీలో చేరిన హుజూరాబాద్ విద్యార్థి సంఘ నేతలు
గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి హరీశ్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ యువత భవిషత్తుకు భరోసానిచ్చేది టిఆర్‌ఎస్సేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏదైతే ఆనాడు ఉద్యమ నేతగా కెసిఆర్ చెప్పారో…అదే లక్ష్యంతో సిఎంగా ఆయన పని చేస్తున్నారన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో హుజురాబాద్ నియోజకవర్గ విద్యార్థి సంఘం నేతలు టిఆర్‌ఎస్‌లో చేరారు. టివిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేర్నాక రమాకాంత్, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి శ్రీకాంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా జాయింట్ సెక్రటరీ పోషంపల్లి రాకేష్, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల అనిల్ తదితరులు టిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మంత్రిగా పని చేసిన సమయంలో ఈటల రాజేందర్ తమను బాగా వేధించారని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మంత్రి హరీశ్‌రావుకు వివరించారు.

తమపై కేసులు పెట్టి కొట్టించారని, జైలుకు పంపారని, భయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఎవరికి భయపడవద్దని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధి సంఘం నేతలకు అండగా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. నీళ్లు, నిధుల విషయంలో సిఎం హామీ ఇచ్చిన రీతిలో లక్ష్యాలు సాధిస్తున్నారన్నారు. అదే రీతిలో నియామకాల విషయంలోను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పారు. ఇవి కాకుండా కొత్తగా 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని సిఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టిఆర్‌ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కె. వాసుదేవరెడ్డి, మొలుగు పూర్ణ చందర్, టేకుల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Student body leaders joined TRS in Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News