Sunday, April 28, 2024

ఎన్నికల వేళ ‘ఉచిత హామీలు’: విచారణకు అంగీకరించిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని పేర్కొంది. ఉచిత హామీల గుర్తులు, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేందుకు ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించేలా ఆదేశించాలని పిటిషనర్ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే దీనిపై విచారణ జరపాలని పిటిషనర్ తరఫున హాజరైన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణన లోకి తీసుకుంది. ఇది ముఖ్యమైన అంశమని, దీనిని రేపు బోర్డు ముందుంచుతామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలపై చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే పథకాలపై రాజకీయ పార్టీలు ఇచ్చే అసంబద్ధ హామీలు ఓటర్లను ప్రభావితం చేస్తాయన్నారు. ఇవి నిష్పక్షపాత ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయన్నారు. రాజకీయ లబ్ధి పొందే ఉద్దేశంతో ఇచ్చే ఇటువంటి ప్రజాకర్షణీయ చర్యలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, వీటిపై నిషేధం విధించాలని అందులో పేర్కొన్నారు. వీటిపై ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News