న్యూఢిల్లీ: కోర్టులలో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చే విషయమై ఒకే రకమైన విధానాన్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మీ వైఖరేమిటో తెలియచేయాలని కోరుతూ సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్పై కేంద్ర న్యాయ శాఖకు, వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీచేస్తూ నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
వివిధ కోర్టులలో పెండింగ్ కేసులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ, ప్రీ-లిటిగేషన్ ప్రక్రియను తప్పనిసరి చేయాలని సూచిస్తూ యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, న్యాయవాది సన్ప్రీత్ సింగ్ అజ్మాని దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. న్యాయస్థానాలలో విచారణ చేపట్టక ముందే రాజీ మార్గంలో వివాదాలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యామ్నాయ యంత్రాంతాన్ని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. కోర్టులకు వెళ్లకముందే లేదా పిటిషన్ దాఖలు చేయకముందే లేదా నోటీసు జారీచేయడానికి ముందే మధ్యవర్తిగా వ్యవహరించే తటస్త మూడవ పార్టీ ద్వారా కక్షిదారుల మధ్య వివాదాన్ని ఉభయులకూ ఆమోదయోగ్యంగా పరిష్కరించేందుకు ప్రీ-లిటిగేషన్ మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని పిటిషనర్లు వాదించారు.