Monday, April 29, 2024

ఘనవిజయంగా సురక్షా దివస్ ర్యాలీ..

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ఎస్పీ అపూర్వా రావు సారథ్యంలో నీలగిరి ర్యాలీతో అంబరాన్నంటిన సంబరాలు..

నల్గొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సురక్షా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు అధ్వర్యంలో సురక్ష దివస్ ర్యాలీని వైభవంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పోలీస్ వాహన ర్యాలీని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి , ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,కలెక్టర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి, ఎస్పీ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి ప్రారంభమై వివేకానంద విగ్రహం మీదుగా క్లాక్ టవర్ సెంటర్ వరకు అత్యంత క్రమశిక్షణతో చేరుకుంది. పోలీసుల ద్విచక్ర వాహానాలతో పాటు పెట్రో కార్స్తో పోలీసు శాఖ నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. పోలీస్ కళాజాత ఆధ్వర్యంలో షీటీమ్, పోలీసుల పనితీరుపై పాటల రూపంలో వినిపించారు. బాంబులు కాల్చుతూ, ర్యాలీ పొడవునా పూల వర్షం కురిపించారు.

ర్యాలీలో దాదాపు 1000 మంది సిబ్బంది, అధికారులు పాల్గొని క్రమశిక్షణతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖ లో చేపట్టిన సంస్కరణలు మార్పులు గమనించాలని నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. భూపాల్ రెడ్డి మాట్లాడుతూ మనందరికీ స్వేచ్ఛనిచ్చింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనేనని , 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో తెలంగాణ అడిగిడుతున్న శుభ సందర్భంగా అన్ని శాఖలు సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేలా సీఎం కేసీఆర్ ఈ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ రాగానే మొట్టమొదటిగా పోలీస్ శాఖ పై ప్రత్యేక దృష్టి సారించి బలోపేతం చేసి శాంతి భద్రతలను అదుపు చేశారని, పోలీస్ శాఖ సేవలు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సమస్యలపై ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కరానికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను దేవాలయాలుగా తీర్చిదిద్దినది మన ప్రభుత్వమని వివరించారు.

రాష్ట్రస్థాయిలో ఏ విధంగా అయితే కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉన్నదో మన నల్లగొండ జిల్లాలో కూడా అదే విధంగా కమాండ్ కంట్రోల్ ఉండాలని అన్నారు. పోలీసు సంక్షేమానికి ఏ అవసరమైన అయినా ఉపయోగించుకోవడానికి నా సొంత నిధుల నుండి రూ.50 లక్షల నిధులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని అరికట్టడంలో మన జిల్లా పోలీసులు ప్రత్యేక కృషి చేశారని, జిల్లా పోలీసులు బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నందున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయిస్తున్నారన్నారు.

నల్లగొండ జిల్లాకు 40 పెట్రోలింగ్ వాహనాలు, 100కు పైగా పెట్రోలింగ్ బైకులు, కంప్యూటర్లు, ట్యాబ్ లు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కేటాయించడం వల్లనే డయల్ 100 కాల్ రాగానే ఏడు నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ సమస్యను పరిష్కారాన్ని కృషి చేస్తున్నారని తెలిపారు. ఏ మారుమూల గ్రామంలోని ప్రజలకైన పోలీసు సేవలు అందిస్తున్నామని, తెలంగాణ స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ద్వారా 775 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉంటే అన్నింటినీ కమండ్ కంట్రోల్ పరిధిలోనే పనిచేస్తున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో దాదాపు 7 వేల సీసీ కెమెరాలు ఉన్నాయని, ఆ సీసీ కెమెరాల ద్వారా అనేక కేసులను చేదించినట్లు తెలిపారు.

షీ టీమ్స్, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు అనేక రక్షణ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.– అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో బాంబ్ స్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్,క్లూస్ టీమ్, షి టీమ్, డయల్ 100 ల పని తీరు పైన అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్మన్ సైది రెడ్డి, ప్రొబేషనరీ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ కేఆర్కే.ప్రసాద రావు,12 వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ రామకృష్ణ, డిఎస్పీ లు నరసింహ రెడ్డి, వెంకటగిరి, నాగేశ్వర రావు, రమేష్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు, సిబ్బంది, పట్టణ కౌనిలర్స్, యువకులు, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.

12వ బెటాలియన్ లో..
పట్టణ పరిధిలోని అన్నెపర్తిలో ఉన్న 12వ బెటాలియన్లో సురక్ష దివస్ సందర్భంగా కమాండెంట్ ఎన్. వి. సాంబయ్య ఆధ్వర్యంలో స్కూల్ చిల్డ్రన్స్ కి ఓపెన్ హౌస్ నిర్వహించి బెటాలియన్ లో ఉన్న అధునాతన ఆయుధాల గురించి అవగాహాన కల్పించారు. ప్రొజెక్టర్ స్క్రీన్ పై బెటాలియన్ సిబ్బంది గత పది సవత్సరాలుగా సొసైటీ కి చేసిన సేవను విడియో రూపం లో చూపించచారు. అదనపు కమాండెంట్ బి.రామకృష్ణ మాట్లాడుతూ పోలీసులు సమాజంలో ప్రజలతో కలిసి మెలిసి ఉండే తీరు, వెపన్స్ పని తీరు గురించి పిల్లలకు వివరించారు. కార్యక్రమంలో సహాయక కమాండెంట్ ఏ. తిరుపతి, టి. వెంకన్న, ఎమ్.రాజు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News