Monday, April 29, 2024

కార్తీక మాసంలో ఆచార్య పురుషుల తిరు నక్షత్రోత్సవాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో భగవంతుని ఆరాధనతోపాటు దాన ధర్మాలు చేస్తే రెట్టింపు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే, ఈ మాసంలో పలువురు భక్తాగ్రేసరుల తిరు నక్షత్రోత్సవాలు ఉండడం విశేషం. నవంబరు 14న శ్రీ తిరుమలనంబి సాత్తుమొర జరిగింది. శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.నవంబరు 16న శ్రీ మనవాళ మహాముని సాత్తుమొర నిర్వహించారు. శ్రీ మనవాళ మహాముని ఒక హిందూ వేదాంతవేత్త. వీరు 15వ శతాబ్దంలో తమిళంలో శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రధానంగా ప్రతిపాదించారు. విశిష్టాద్వైత తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

నవంబరు 19న శ్రీ అత్రి మహర్షి వార్షిక తిరునక్షత్రోత్సవం జరిగింది. సప్తర్షి నక్షత్ర మండలంలో అత్రి ఒకరు. వీరి గౌరవార్థం ఋగ్వేదంలోని ఐదో మండలాన్ని అత్రి మండలం అని పిలుస్తారు. నవంబరు 22న శ్రీ యాజ్ఞవల్క్యుని జయంతి జరిగింది. శ్రీ యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే శ్రీ యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం (బృహదారణ్యకోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించారు.

నవంబరు 27న శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర జరుగనుంది. శ్రీ తిరుమంగై ఆళ్వార్ దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వారులలో చివరివాడు. వీరు శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని కీర్తిస్తూ పాసురాలు రచించారు. వీరిని పరకాలయోగి అని కూడా పిలుస్తారు. నవంబరు 28న శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రోత్సవం జరుగనుంది. 12 మంది ఆళ్వారులలో 11వ వాడు శ్రీ తిరుప్పాణాళ్వార్. వీరు అళ్వార్ల పాశురాలను నాలాయిర దివ్య ప్రబంధంగా సంకలనం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News