Monday, April 29, 2024

ఇంటి గోడపై పులి.. గంటల కొద్దీ నిద్ర

- Advertisement -
- Advertisement -

లక్నో : పులిని చూస్తేనే గజగజ వణికిపోతాం. అదే పులి జనవాసాల్లోకి వస్తే గుండెలు గుభిల్లు మన్సాలిందే. కానీ రాయల్ బెంగాల్ టైగర్ మాత్రం ఏకంగా ఓ గ్రామంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో అత్‌కోనా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి సోమవారం రాత్రి ఓ పులి వచ్చింది. అర్ధరాత్రి దాటాక గ్రామంలోకి ప్రవేశించిన పులి షిందు సింగ్ అనే రైతు ఇంటి గోడపై దాదాపు ఆరు గంటల పాటు హాయిగా నిద్రించింది. ఇది చూసిన కుక్కలు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. వెంటనే నిద్ర నుంచి లేచిన షిందు సింగ్.. గోడపై నిద్రిస్తున్న పులిని చూసి షాక్ అయ్యాడు. వెంటనే తన ఇంటి సమీపంలో ఉండే వారికి విషయం చెప్పాడు. ఇక ఈ విషయం ఊరంతా తెలిసింది. పులి నుంచి రక్షణ కోసం కొందరు తమ ఇంటి బయట మంటలు వెలిగించారు. మరికొందరు బిల్డింగ్ పైకి ఎక్కారు.

మరికొందరు షిందు సింగ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. నిద్రిస్తున్న పులిని చూశారు. కొందరు తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించారు. మరికొందరు పులికి దూరంగా ఉండి సెల్పీలు తీసుకున్నారు. ఇంతలో జనం అలికిడి విని పులి నిద్ర లేచింది. అందరూ చూస్తున్నా ఆ పులి ఏ మాత్రం వారిని పట్టించుకోలేదు. వారిపై దాడి కూడా చేయలేదు. గ్రామస్తులే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. గోడ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆ పులికి మత్తు మందు ఇచ్చి బంధించారు. ఆ తర్వాత పులిని అక్కడి నుంచి తరలించారు. ఈ పులికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News