Monday, April 29, 2024

తిరుమల టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ / తిరుమల:  తిరుమల టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి:

తిరుపతిలోని అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో అనునిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ యజ్ఞం నిర్వహణకు చెల్లించాల్సిన రుసుమును త్వరలో నిర్ణయిస్తారు.

తన మధురమైన కంఠం ద్వారా అన్నమాచార్య సంకీర్తనలకు విశేష ప్రాచుర్యం కల్పించిన టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో వేలాది మంది సామాన్య భక్తులు గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డుపైన సరైన వసతులు లేని తాత్కాలిక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. వీరి సౌకర్యార్థం రూ.18 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లు, టాయిలెట్లు నారాయణగిరి విశ్రాంతి గృహం సర్కిల్, ఆళ్వార్ ట్యాంకు రోడ్డు సర్కిల్ వద్ద రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి మోకాలిమెట్టు వరకు రోడ్డు పక్కన నడిచే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులకు గురికాకుండా రూ.2.81 కోట్లతో నడకదారి షెల్టర్లు నిర్మాణానికి టెండర్లు ఆమోదం తెలిపారు.

యాత్రికులకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో తిరుమలలో ఎపి టూరిజం సంస్థ ఒక క్యాంటీన్ నిర్వహిస్తోంది. అదేవిధంగా అన్నమయ్య భవనం, నారాయణగిరి క్యాంటీన్లలో భక్తులకు భోజనం తక్కువ ధరకే ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. . ఇందులో భాగంగా రూ.2.93 కోట్లతో నారాయణగిరి క్యాంటీన్లో మూడో అంతస్తు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేయడానికి టెండరు ఆమోదం తెలిపారు. తిరుమలలో 63 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీవారి కుటీర్, గాయత్రీ సదన్, టిబిసి-53, టిబిసి-64 తదితర 13 విశ్రాంతి గృహాలను కాటేజి డొనేషన్ స్కీమ్ కింద పునర్నిర్మాణం చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఆమోదం తెలిపారు. ఒక గ్రామంగా ఉన్న తిరుపతి శ్రీవారి దయతో నగరంగా అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో దూరప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తిరుపతిలోని ముఖ్య రహదారులన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మరమ్మతులు, నిర్వహణకు టిటిడి బాధ్యత తీసుకుంది. ఇక్కడ టిటిడికి చెందిన ఆలయాలతోపాటు టిటిడికి సంస్థలు, వసతి సముదాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని గుర్తించి పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను టిటిడి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు సంస్థలన్నీ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అభివృద్ధి పనులు చేస్తున్న విషయం తెలిసిందే.

టిటిడి కూడా తన సామాజిక బాధ్యతగా వేలాది మంది భక్తులు వచ్చే తిరుపతి పట్టణాన్ని కూడా అభివృద్ధిపరచాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం టిటిడి బడ్జెట్లో ఒక శాతం తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని జాపాలి తీర్థం, శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలకు వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉంది. అదేవిధంగా హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తద్వారా భవిష్యత్తులో ఈ మార్గంలో మరింత రద్దీ పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రోడ్డు సామర్థ్యం సరిపోనందున ఆకాశగంగ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రూ.40 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపారు. ఇందులో గోగర్భం డ్యామ్ భద్రత దృష్ట్యా రోడ్డు నిర్మాణం డ్యామ్కు దిగువన వచ్చేలా ప్లాన్స్ రూపొందించడం జరిగింది. తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు రూ.10.80 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు, ఫుట్పాత్, డ్రెయిన్లు, వీధి దీపాలు, సైన్బోర్డులు ఏర్పాటుకు ఆమోదం. దీని వలన ఈ ప్రాంతంలోని యాత్రికులకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది.

పురాతన కట్టడాలైన శ్రీకాళహస్తి రాజగోపురం కూలడం, శ్రీరంగంలోని మహారాజగోపురానికి ఇటీవల బీటలు రావడం మనం చూశాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల భద్రత దృష్ట్యా ఐఐటి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటుచేసి చాలా ఏళ్ల క్రితం నిర్మించిన టిటిడిలోని అన్ని ఆలయాలు, గోపురాల పటిష్టతను పరిశీలిస్తామని తెలిపింది. కమిటీ నివేదిక ఆధారంగా మరమ్మతులు చేసి మరలా భావితరాల వారికి ఆలయాలు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. గతంలో చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం శ్రీవారిమెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 2010వ సంవత్సరంలో రోడ్డు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం దారిలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో, పెరిగిన ట్రాఫిక్కు అనుగుణంగా దీన్ని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి బిటి రోడ్డు, వీధిదీపాలు, డ్రెయిన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు రూ.25 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరుకు ఆమోదం తెలిపారు.

టిటిడి పాఠశాలల్లో చదువుతున్న 3,259 మంది విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు 2023-24 విద్యా సంవత్సరం నుండి టిటిడి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. గతంలో ఇస్కాన్ సంస్థ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసి సమీపంలోని టిటిడి కళాశాలల హాస్టళ్ల నుండి పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. అన్నం, సాంబారు, కూర, రసం, చట్నీ, పెరుగు లేదా మజ్జిగను మెనుగా దిట్టాన్ని నిర్ణయించింది. ఇందుకుగాను సంవత్సరానికి రూ.2.63 కోట్లకు పైగా వ్యయం చేయడానికి ఆమోదం తెలిపింది. టిటిడి కల్యాణ మండపాల్లో వివాహాలు జరిపే సమయంలో డిజె పాటలు కాకుండా భక్తిగీతాలతో మాత్రమే సంగీత విభావరి నిర్వహించుకోవాలని నిబంధన విధించారు. దూరప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు తమ బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్ చేసి తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అలిపిరిలో ప్రస్తుతం 130 వాహనాలను పార్క్ చేసేందుకు 2.47 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 156 బస్సులు, 683 కార్లు/జీపులు, 1325 ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా, 7 అదనపు టాయ్లెట్లు, యాత్రికులు వంట చేసుకునేందుకు అనువుగా మూడు షెడ్లు నిర్మాణానికి మరో 11.34 ఎకరాలు అభివృద్ధి చేసి, ఇక్కడ బిటి రోడ్లు, భూదేవి కాంప్లెక్సు వద్ద దర్శనటోకెన్లు పొందే భక్తులకు క్యూలైన్లు, లైటింగ్ తదితర వసతులు కల్పించేందుకు రూ.21.60 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్, కమిషనర్ సత్యనారాయణ, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం,బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News