మనోహరాబాద్-గజ్వేల్ మధ్య ట్రయల్ రన్ సక్సెస్
గజ్వేల్: మనోహరాబాద్ కొత్తపల్లి రైలు మార్గంలో భాగమైన మనోహరాబాద్ గజ్వేల్ మధ్య రైలు నడవటానికి ఇక ముహూర్తం నిర్ణయించటమే తరువాయిగా ఉంది. గురువారం దక్షిణ మధ్య రైల్వే సేష్టీ కమిషన్ అధికారుల బృందం నేతృత్వంలో సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలును ట్రాక్పై నడిపి పరీక్షించారు. మొత్తం 31 కిలోమీటర్ల ఈ రైలు మార్గంలో అధికారులు తనిఖీ చేశారు. ఆర్ఎస్సి కమిషనర్ రాం క్రిపాల్ నేతృత్వంలోని రమేష్కుమార్రెడ్డి, సుబ్రహ్మణ్యంతో కూడిన అధికారుల బృందం ప్రత్యేక ట్రాలీలో ప్రయాణిస్తూ ట్రాక్ నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు.
అనంతరం గజ్వేల్ నుంచి మనోహరాబాద్ వరకు 120కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైలును నడిపి స్పీడ్ టెస్ట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్ సాంకేతికంగా బాగుందని, రైలు నడపటానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్ఎస్సి అధికారులు తెలిపారు. తమ తనిఖీ నివేదికను దక్షిణ మధ్య రైల్వే బోర్డు అధికారులకు అందచేస్తామని, తర్వాత పరిశీలించి ఎప్పటి నుంచి ఈ మార్గంలో రైలు నడపాలన్నది నిర్ణయిస్తారన్నారు. అంతకుముందు గజ్వేల్ రైలు స్టేషన్లో సూపర్ ఫాస్ట్ రైలు రాగానే దానికి వేద పండితుల ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 120కిలోమీటర్ల వేగంతో ఇక్కడి నుంచి మనోహరాబాద్కు టెస్ట్ రన్ నిర్వహించారు.
Trail Run Success Between Manoharabad to Gajwel