Monday, April 29, 2024

నేడు కేబినెట్ కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

నేడు సమీకృత కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ
సిఎం కెసిఆర్ నేతృత్వంలో మ.3 గంటలకు మంత్రివర్గ సమావేశం
ఎజెండాలో 20కి పైగా ఫైళ్లు, టేబుల్ ఎజెండాగా అత్యధిక అంశాలు
మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం
తెలంగాణా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై క్యాబినెట్‌లో కీలక చర్చ
రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు విస్తృత ప్రచార కల్పనపై దృష్టి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇదే మొదటి క్యాబినెట్ సమావేశం కానుంది. ఇందుకోసం సాధారణ పరిపాలన శాఖ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఎజెండాలో 20కి పైగా అంశాలు ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతితో ఈసారి ఎక్కువ అంశాలు టేబుల్ ఎజెండాగానే మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో చర్చించి ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. గురువారం(మే 18) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో సమీకృత కొత్త సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం మొదటిసారి సమావేశం కాబోతోంది. మంజీరా కార్పొరేషన్ ఏర్పాటు ఆమోదం, ర్యాటిఫికేషన్ కోసం అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటి ఇరిగేషన్ ఫైల్స్‌తో సహా మొత్తం 20కి పైగా అంశాలు ఎజెండాలో ఉండనున్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలపై సిఎం దిశానిర్ధేశం
తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై క్యాబినెట్ సమావేశంలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. వేడుకల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సమాలోచనలు జరిపి మంత్రులు, అధికారులకు సిఎం దిశా నిర్దేశం చేయనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్మారక జ్యోతి ప్రారంభ తేదీ మంత్రివర్గ సమావేశంలో ఖరారయ్యే అవకాశం ఉంది. అలాగే పోడు పట్టాల అంశంపై ఒక స్టేటస్ రిపోర్ట్ కేబినెట్ ముందుకు రానున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 50 వేల మంది ఆదివాసీలు, గిరిజనులకు సుమారు 4 లక్షల ఎకరాల పోడు భూమికి సంబంధించి పట్టాలు పంచే కార్యక్రమ తేదీపై కూడా ఇదే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా మంత్రివర్గం సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్లు తెలిసింది.

గవర్నర్ కోటా ఎంఎల్‌సి పేర్లను ఆమోదించే అవకాశం
గవర్నర్ కోటా నామినేటెడ్ ఎంఎల్‌సిలు రాజేశ్వరరావు, ఫారుఖ్ హుస్సేన్‌ల పదవీకాలం ఈ నెల 27వ తేదీతో ముగుస్తుంది. ఆ ఎంఎల్‌సిల పేర్లను కేబినెట్ ఆమోదించి గవర్నర్‌కు సిఫారసు చేసే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మంత్రివర్గంలో చర్చించే ఆస్కారం ఉన్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై కూడా మంత్రివర్గ సమావేశం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలతో టేక్ ఆఫ్ అయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశలో మంత్రులకు ఈ సమావేశం ద్వారా సిఎం కెసిఆర్ ఒక రోడ్ మ్యాప్‌ను ఇచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News