నేటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్
మొదటిసారి ఆన్లైన్ విధానంలో ప్రవేశాల ప్రక్రియ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఐదేళ్లు, మూడేళ్ల ఎల్ఎల్బితో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ పి.రమేష్ బాబు ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈసారి మొట్టమొదటిసారిగా లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ పి.రమేష్బాబు తెలిపారు. లాసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి 22 వరకు ఆన్లైన్లో తమ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 26, 27 తేదీలలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఎన్సిసి, సిఎపి, పిహెచ్, స్పోర్ట్ తదితర స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీన మొదటి విడత లాసెట్ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29 నుంచి 31 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలని, అదే సమయంలో విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీస్తారని పేర్కొన్నారు.
ఈ నెల 31 నుంచి న్యాయ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. రెండవ విడత షెడ్యూల్ను తర్వాత వెల్లడిస్తారని తెలిపారు. వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. ఈ ఏడాది లాసెట్, పిజిఎల్సెట్లో 21,559 మంది విద్యార్థులు అర్హత సాధించారని, ఆన్లైన్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా కేవలం సీట్లు పొందిన విద్యార్థులకు భౌతికంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని, మిగతా విద్యార్థులకు అవసరం ఉండదని వివరించారు. దీనివల్ల విద్యార్థులు దూరప్రాంతాల నుంచి వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాల్సిన అవసరం ఉండదనని, విద్యార్థుల సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.
TS LAWCET 2020 Online Counseling from Dec 14