Monday, April 29, 2024

ఉద్యోగులకు అండగా ఉంటాం: టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) అండగా నిలిచింది. అకాల మృత్యువుతో మృత్యువాత పడిన కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి ఆర్టీసి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న టిఎస్ ఆర్టీసి బస్సును రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మల్యాల- బలవంతాపూర్ స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండక్టర్ కుటుంబంలో విషాదం అలముకుంది.

ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్కరకొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్‌ను ఇటీవల యూబీఐకి టిఎస్‌ఆర్టీసి యాజమాన్యం మార్చింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు తీసుకోవాలని ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40లక్షలు, రూపే కార్డు కింద మరో రూ.10లక్షలను యూబీఐ అందజేస్తోంది.

2 చెక్కులను అందచేసిన ఎండి
ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల డిపో కండక్టర్ బొల్లం సత్తయ్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కులను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ ఎండి విసి సజ్జనార్ మంగళవారం బస్‌భవన్‌లో అందజేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండక్టర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫతో పాటు కొడుకు ప్రవీణ్ కుమార్, కూతురు మాధవీలతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉపకరిస్తుంది: సజ్జనార్
చెక్కులను అందజేసిన అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో సత్తయ్య అకాల మృత్యువాత పడడం దురదృష్టకరమన్నారు. సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోషణలో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుందని, ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుం దని ఆయన తెలిపారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాలను యాజమాన్యం మార్చిందన్నారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ ఖాతాలకు మార్చుకోవాలని ఎండి సూచించారు. కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని ఎండి సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ఎండి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఓఓ డాక్టర్ వి.రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు ఎస్.కృష్ణకాంత్, వినోద్‌కుమార్, యూబీఐ జనరల్ మేనేజర్ పి.క్రిష్ణణ్, రీజినల్ హెడ్ డి.అపర్ణ రెడ్డి, డిప్యూటీ రీజనల్ హెడ్ జి.వి.మురళీ కృష్ణలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News