Monday, April 29, 2024

చతుర్వేద హవనం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు :  టిటిడి ఈవో 

- Advertisement -
- Advertisement -

తిరుపతి: లోక కల్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడిఈవో  ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమాన్ని టీటీడీ గతంలో విశాఖపట్నం,
కోవూరులో నిర్వహించినట్లు తెలిపారు. మొదటిసారిగా తిరుపతిలో ఏడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు . వేదాలు ఎలా ఉద్భవించాయి, వేదాల విశిష్టత, వేదాలు మానవ జీవన విధానానికి ఏ విధంగా తోడ్పడతాయనే అంశాలపై ప్రముఖ పండితులతో ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్టాల నుండి 32 మంది రుత్వికులు ఈ కార్యక్రమాన్ని శాస్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. మైదానాన్ని ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అధికారులకు శ్రీ ధర్మారెడ్డి సూచించారు. ఉదయం హోమ కార్యక్రమాలు, సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ చరిత్ర ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు వీక్షించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

చతుర్వేద హవనం కార్యక్రమాలు ఇలా:
జూన్ 29 నుండి జులై 5 వ తేదీ వరకు రోజు ఉదయం 8నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుర్వేద హవనం.
అన్ని వేదాల్లోని మంత్రాలు పఠిస్తూ హోమము
– సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు చతుర్వేద మంత్ర పారాయణం
– సాయంత్రం 6 గంటల నుండి సంగీత, నృత్య కార్యక్రమాలు, ప్రవచనాలు ఉంటాయి.
– ప్రతి రోజు ఉదయం కార్యక్రమానికి వచ్చే భక్తులతో కూడా సంకల్పం చెప్పిస్తారు.

జేఈవోలు శ్రీమతి సదా భార్గవి,  వీరబ్రహ్మం , వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, సిఏఓ  శేష శైలేంద్ర, సిఈ  నాగేశ్వరరావు, విజిఓ శ్రీ మనోహర్, పిఆర్ఓ డా.రవి, డిపిపి ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, డి పిపి కార్యదర్శి శ్రీనివాసులు ,అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ , ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News