25 బాక్స్ల ఆయిల్ స్వాధీనం
పరారీలో మరో నిందితుడు
హైదరాబాద్: నిషేధిత హాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 25 బాక్స్ల హాష్ ఆయిల్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని బోరబండకు చెందిన ఎండి మహబూబ్అలీ అలియాస్ షూటర్ రియాజ్, ఎండి ఇబ్రహిం ఖాన్ అలియాస్ ఐజాజ్ కూలీ పనిచేస్తున్నాడు. యూసుఫ్గూడకు చెందిన ఎండి ఖాజా ముబీనుద్దిన్ విద్యార్థి. ప్రధాన నిందితుడు మహబూబ్అలీపై రెండు రాబరీ కేసులు, హత్యాయత్నం కేసు ఉన్నది. ఎండి మహబూబ్అలీ, ఎండి ఇబ్రహిం ఇద్దరు బోరబండలో ఉంటున్నారు.
ఇద్దరు గంజాయి, హాష్ ఆయిల్, డ్రగ్స్కు బానిసలుగా మారారు. తరచూ వాటిని తీసుకునేవారు,వీరికి ఆరు నెలల క్రితం ఎండి ఖాజా మొబినుద్దిన్ పరిచయమయ్యాడు. తక్కువ కాలంలోని వారికి క్లోజ్ అయ్యాడు. ముగ్గురు కలిసి తక్కువ ధరకు హాష్ ఆయిల్ కొనుగోలు చేసి తీసుకువచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశారు. నగరంలో యువకులకు డ్రగ్స్ విక్రయిస్తు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారు. డ్రగ్స్ వాడుతున్న వారి సర్కిల్లో ముగ్గురు నిందితులు ఫేమస్గా మారారు. యువత మత్తు పదార్థాలను కావాలంటే వీరిని సంప్రదించేవారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సౌత్జోన్ టాస్క్ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సై శ్రీశైలం, నరేందర్, ఎండి తకియుద్దిన్, చంద్రమోహన్ తదితరులు పట్టుకున్నారు.